హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల్లేని వృద్ధి ఎందుకని ప్రశ్నించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్. ఉపాధి కల్పన దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించిన ఇక్ఫాయ్ 13వ స్నాతకోత్సవానికి రంగరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం బాగానే ఉన్నా.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలను సరిపడా సృష్టించలేని ఆ వృద్ధి దేనికంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ.. దేశ ఆర్థిక తీరుతెన్నులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశం ఏ ఒక్క రంగానికో పరిమితం కారాదు. వ్యవసాయం, పారిశ్రామికం, వ్యాపారం, మౌలిక వసతుల కల్పన ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి. సకల రంగాలకూ సమ ప్రాధాన్యత దక్కాలి. ప్రస్తుతం మనం 7 శాతం వృద్ధిరేటును సాధించాం. ఇదే వృద్ధిరేటును నిరంతరంగా వచ్చే 20 ఏండ్లపాటు కొనసాగించాలి. అప్పుడే దేశంలో గణనీయమైన మార్పును తీసుకురాగలం’ అన్నా రు. నిజానికి వృద్ధిలేనిదే మెరుగైన ఉపాధి అవకాశాలు నిలకడగా ఉండలేవన్న ఆయన.. అందుకే 7 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. అంతేగాక ఎగుమతులు, తయారీ రంగం బలంగా ఉన్నప్పుడే ఆకర్షణీయ వృద్ధిని అందుకుంటామన్నారు.
కరోనా ప్రభావం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశ భవిష్యత్తు, అభివృద్ధికి స్పష్టమైన రోడ్మ్యాప్ను రూపొందించాల్సిన అవసరం ఉందని రంగరాజన్ ఈ సందర్భంగా చెప్పారు. దీన్నే నేటి అత్యవసరమైన, ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఉపాధి సహిత వృద్ధిరేటును పెంచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. మన దేశాన్ని మిగతా ప్రపంచం నుంచి వేరుచేయలేమని చెప్తూనే.. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని నిర్మించుకోవడం అతి ముఖ్యమైనదని హితవు పలికారు.
ప్రజల కనీస అవసరాలను తీర్చే బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదేనని రంగరాజన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యలోటును గమనిస్తూ ప్రభుత్వాలు అప్పులు చేస్తే తప్పేమీ కాదన్న ఆయన.. పరిమితికి మించి రుణభారం ఉంటే మాత్రం తిప్పలేనని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పేదలకు సబ్సిడీ రేషన్ బియ్యం ఇవ్వాల్సిందేనని, అవసరమైన ఇతరత్రా రాయితీలూ ఉండాల్సిందేనన్నారు. అయితే ప్రజల జీవన పరిస్థితులు మెరుగైతే వీటన్నిటిపై ఆధారపడే అక్కెర లేదన్న రంగరాజన్.. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
విద్యార్థి భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, దేశాన్ని మార్చగలిగే సామర్థ్యం వారికే ఉందని రంగరాజన్ అన్నారు. దేశాభివృద్ధి, మార్పులు ఉన్నత విద్యతోనే సాధ్యపడుతాయన్న ఆయన.. యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీలకు సమ ప్రాధాన్యతనివ్వాలన్నారు. అణగారిన వర్గాలకూ ఉన్నత విద్య అందేలా చూడాలని, ఈ విషయమై ఏ సంస్కరణనూ విస్మరించరాదని చెప్పారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు.. ప్రయోగాలు, ఆవిష్కరణలవైపు విద్యార్థులు స్వేచ్ఛగా పయనించే వెసులుబాటును కల్పించాలన్నారు.
గడిచిన ఐదు దశాబ్దాల్లో భారత వార్షిక వృద్ధిరేటు కేవలం 0.89 శాతమేనని, జనాభా వృద్ధిరేటు 0.83 శాతంగా ఉందని, అయినప్పటికీ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం శుభపరిణామంగానే రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఇంకా తలసరి ఆదాయ సమస్యలను ఎదుర్కొంటోందని గుర్తుచేశారు ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) మాజీ చైర్మన్ కూడా అయిన రంగరాజన్. 2020లో భారత తలసరి ఆదాయ ర్యాంక్ను పరిశీలిస్తే.. 197 దేశాల్లో 142గా ఉందని చెప్పారు. కాబట్టి ప్రస్తుత స్థాయిల నుంచి భారతీయుల తలసరి ఆదాయం ఎంతో వేగంగా పెరగాల్సిన అవసరమైతే తప్పక ఉన్నదన్నారు.