Mark Zuckerberg | ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ ఈసీవో మార్గ్ జుకర్బర్గ్ రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగుల్ని తొలగించేలా ఉన్నారు. మెటా సంస్థలో గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు మార్క్ జుకర్బర్గ్ ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో మెటాలో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ కథనం వెలువరించింది.
గతవారం కంపెనీలో జరిగిన సమావేశం సందర్భంగా ‘కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా.. పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందే’ అని మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులను జుకర్ బర్గ్ హెచ్చరించారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబరచాల్సిందే అని తేల్చిచెప్పారు. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
కాగా, గతేడాది నవంబర్లో కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదాయంలో ఒడిదొడుకులు, పారిశ్రామిక కష్టాలను అధిగమించేందుకు ఈ చర్య చేపడుతున్నట్టు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. అయితే, తాజాగా జుకర్బర్గ్ వార్నింగ్తో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.