న్యూఢిల్లీ, మే 5: బ్యాంకులు రుణాలపై వడ్డింపుల్ని మొదలుపెట్టాయి. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచాయి. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (0.4 శాతం) పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు 4.4 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ రుణాలపై వడ్డీరేట్లను పెంచడం ఆరంభించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను ఐసీఐసీఐ బ్యాంక్ 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఐ-ఈబీఎల్ఆర్ 8.1 శాతానికి చేరింది. ఈ నెల 4 నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తమ వెబ్సైట్లో బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటు వంటి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్స్ ఆధారంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల కోసం నిర్దేశించుకున్నదే ఈబీఎల్ఆర్. ఇది కనీస వడ్డీరేటు. ఇంతకంటే తక్కువ వడ్డీరేట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వరాదు. 2010లో బేస్ లెండింగ్ రేటు (బీఎల్ఆర్)ను ఆర్బీఐ పరిచయం చేయగా, 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్), 2019 అక్టోబర్లో ఈబీఎల్ఆర్ విధానాలు వచ్చాయి.
బీవోఐ, సెంట్రల్ బ్యాంక్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్బీఎల్ఆర్) 7.25 శాతానికి పెరిగింది. పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తమ ఆర్బీఎల్ఆర్ను 0.4 శాతం పెంచి 7.25 శాతానికి చేర్చింది. శుక్రవారం కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇంకా ఎస్బీఐ రేట్ల పెంపును ప్రకటించలేదు. ఈ బ్యాంకు ఈబీఎల్ఆర్ 6.65 శాతంగా ఉండగా, ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గత నెల ఎస్బీఐ అన్ని కాలపరిమితులకుగాను తమ ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచినది విదితమే. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.1 శాతానికి చేరింది.
ఎఫ్డీలపైనా పెంపు
ఎఫ్డీలపైనా ఐసీఐసీఐ వడ్డీరేట్లను పెంచింది. రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య వివిధ కాలపరిమితులు కలిగిన డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్డీలపై వడ్డీరేటు 2.75 శాతానికి, 30 రోజుల నుంచి 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 3 శాతానికి పెరిగాయి. అలాగే 61 రోజుల నుంచి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై వడ్డీరేటును 3.25 శాతంగా నిర్ణయించింది.
కొటక్ మహీంద్రా బ్యాంక్
ఎఫ్డీలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచింది. ఆయా కాలపరిమితులతో కూడిన రిటైల్ కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను 0.35 శాతం వరకు పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో కొటక్ తెలిపింది. శుక్రవారం నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తుండగా, రూ.2 కోట్ల దిగువన ఉన్న అన్ని డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి. దీంతో 390 రోజుల డిపాజిట్పై వడ్డీరేటు 0.3 శాతం పెరిగి 5.5 శాతానికి చేరింది. అలాగే 23 నెలల డిపాజిట్లపై వడ్డీరేటు 0.35 శాతం పెరిగి 5.6 శాతానికి వచ్చింది. అలాగే 23 నెలలు, ఆపై కాలపరిమితి డిపాజిట్లకుగాను వృద్ధుల కోసం సేవింగ్స్ రేటును 6.1 శాతంగా బ్యాంక్ నిర్ణయించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా
రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను బ్యాంక్ ఆఫ్ బరోడా 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బీ-ఆర్ఎల్ఎల్ఆర్ 6.9 శాతానికి చేరింది. తక్షణమే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయన్నది. ఫలితంగా వాహన రుణాలు, గృహ రుణాలు, ఇతరత్రా రుణాలపై వడ్డీరేట్లు పెరిగిపోనున్నాయి. దీంతో ఆయా రుణాల నెలసరి వాయిదా చెల్లింపులు (ఈఎంఐ), రుణ కాలపరిమితులు ఒక్కసారిగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో ఆర్బీఐ రెండు రోజుల అత్యవసర ద్రవ్యసమీక్ష నిర్వహించి రెపో రేటును 0.4 శాతం పెంచేసింది. ఇప్పుడు ఆ పెంపును రుణగ్రహీతలకు బ్యాంకులు బదిలీ చేస్తున్నాయి. నిజానికి ఆర్బీఐ ద్రవ్యసమీక్షకు ముందే పలు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను ఇప్పటికే పెంచిన విషయం తెలిసిందే.