న్యూఢిల్లీ, మే 13: బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మరోసారి ఐదు రోజుల పనిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పనిని కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పొదుపు చర్యల్లో భాగంగా ఇంధన పరిరక్షణ చర్యలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంటూ.. ఐదు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల కాన్ఫెడరేషన్(ఏఐబీవోసీ) ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయడం అత్యవసరం… ఈ డిమాండ్ కేవలం ఒక సేవా నిబంధనలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు..ఇది ఇంధన పరిరక్షణ, శక్తి ఆదా, పర్యావరణ పరిరక్షణ, కార్యాచరణ సామర్థ్యం, ప్రజా సౌకర్యం వంటి లక్ష్యాలను నేరుగా ముందుకు తీసుకువెళ్లే ఒక ఆచరణాత్మక అమలు చేయదగిన అంశమని పేర్కొంది.
శాఖ కార్యకలాపాలు, నగదు నిర్వహణ, కస్టమర్ సేవలు, నిబంధనల పాటింపు, వసూళ్లు, క్షేత్రస్థాయి ఆర్థిక సమ్మిళితం, ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు, ఉద్యోగుల అవసరమని తెలిపారు. ఐదు రోజుల పనిభారంతో లక్షలాది మంది బ్యాంకింగ్ ఉద్యోగుల ప్రయాణ భారాన్ని తగ్గించనున్నదని వెల్లడించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిపోనుండటంతోపాటు ట్రాఫిక్, విద్యుత్ వినిమయం మరింత తగ్గనున్నదని, వీటితోపాటు మౌలిక నిర్వహణ సదుపాయాల కోసం పెట్టే ఖర్చు తగ్గనున్నదని తెలిపింది.