హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు చెందిన క్లస్టర్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) తక్కువ వడ్డీపై రాష్ర్టాలకు రుణాలు సమకూరుస్తున్నది. దీనికోసం సిడ్బీ క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో నిధిని ఏర్పాటుచేశారు. ఈ పథకం కింద తక్కువ వడ్డీపై ఏడేళ్ల గడువుతో రుణాలు మంజూరు చేయనున్నారని వారు పేర్కొన్నారు. ‘మేకింగ్ ఫ్యూచర్ రెడీ సస్టెయినబుల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ పేరుతో ఇటీవల గోవాలో వర్క్షాప్ను ఏర్పాటుచేసి వివిధ రాష్ర్టాలకు చెందిన పరిశ్రమల అధికారులకు దీనిపై అవగాహన కల్పించారు. మన రాష్ట్రం నుంచి పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీకి చెందిన అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 50కిపైగా కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటుచేయగా, భవిష్యత్తులో మరిన్ని క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.