Bank of India MCLR Rise | ఆర్బీఐ రెపోరేటు పెంపుకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లు పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేరింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కూడా ఇండ్ల రుణాలతోపాటు వివిధ రకాల రుణాలపై కీలక వడ్డీరేట్లు పెంచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 15 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణ గ్రహీతలపై దాని పెంపు వల్ల వారి ఈఎంఐ భారం పెరుగుతుంది.
ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతం నుంచి 7.50 శాతానికి పెరుగుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.05, 7.10, 7.20 శాతానికి పెరుగుతుంది. అయితే 15 రోజుల గడువు రుణాల నుంచి మూడేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ మాత్రం 2.90, 7.70 శాతంగా యధాతథంగా కొనసాగిస్తున్నది.
గత మే నెల నుంచి ఆర్బీఐ రెండు దఫాలు రెపోరేట్ 90 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో రెపోరేట్ 4.90 శాతానికి పెరిగింది. వివిధ వస్తువుల ధరల భారం, అంతర్జాతీయంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల వడ్డీరేట్లు మరింత పెరుగుతాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.