Home Loans | రుణాలపై ఇండ్లు కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) గుడ్ న్యూస్ తెలిపింది. ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 0.40 శాతం తగ్గించి 8.5 శాతానికి కుదించినట్లు పేర్కొంది. ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జి పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణాలపైనా వడ్డీరేట్లు తగ్గించింది. 8.4 శాతం వడ్డీకే ఎంఎస్ఎంఈ రుణాలు లభిస్తాయని పేర్కొంది. ఎంఎస్ఎంఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం తగ్గిస్తున్నామని తెలిపింది. ఈ నెల ఐదో తేదీ నుంచి 31వ తేదీ వరకు వడ్డీరేట్లలో మార్పులు వర్తిస్తాయని వివరించింది.
కొత్తగా ఇండ్ల రుణాలు తీసుకునే వారికి, ఇతర బ్యాంకుల్లో ఇండ్ల రుణాల బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఇండ్ల మరమ్మతు రుణాలకూ ఈ వడ్డీరేట్ల తగ్గింపు వర్తిస్తుంది. దీంతోపాటు రుణ గ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లు ఖరారవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. యాప్ ద్వారా గానీ, వెబ్సైట్ ద్వారా గానీ ఇండ్ల రుణం కోసం డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు సమీపంలోని బ్యాంకు శాఖను సందర్శించి కూడా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు.
ఏ. వేతన జీవులకు : గత మూడు నెలల శాలరీ స్లిప్లు/ గత రెండు సంవత్సరాల ఫామ్-16 ప్రతులు/ గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయం పన్ను రిటర్న్స్.
బీ. స్వయం ఉపాధి పొందుతున్న వారికి బిజినెస్ చిరునామా ఆధారాలు, గత మూడేండ్ల ఆదాయం పన్ను రిటర్న్స్, బ్యాలెన్స్షీట్, బిజినెస్ లైసెన్స్, టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్-16 అవసరమైతే)
ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ నిరంతరం వడ్డీరేట్లు పెంచుతూ వచ్చింది. దీంతో ఇండ్ల రుణాల నుంచి ఆటో, వ్యక్తిగత రుణాలు కూడా పిరంగా మారాయి. ద్రవ్య పరపతి కమిటీ ప్రతి మూడు నెలలకోసారి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో తొలిసారి ద్రవ్య పరపతి కమిటీ సమీక్షించింది. గతేడాది మే 2,3 తేదీల్లో అత్యవసరంగా సమావేశమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ 40 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 4.40 శాతానికి చేరుకున్నది. 2020 మే 22 తర్వాత ఆర్బీఐ రెపోరేట్ పెంచడం ఇదే తొలిసారి. తదుపరి జూన్ 6-8 తేదీల మధ్య 0.50 శాతం, ఆగస్టులో 50 బేసిక్ పాయింట్లు, డిసెంబర్లో 6.25 శాతానికి, ఫిబ్రవరిలో 6.50 శాతానికి చేరింది.