న్యూఢిల్లీ, నవంబర్ 4: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,253 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.3,313 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని తెలిపింది.
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.23,080 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.32,033 కోట్లకు ఎగబాకింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.21,254 కోట్ల నుంచి రూ.27,862 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.31 శాతం నుంచి 3.32 శాతానికి తగ్గగా..నికర ఎన్పీఏ 1.16 శాతం నుంచి 0.76 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,161 కోట్ల నిధులను కేటాయించింది. ఏడాది క్రితం కేటాయించిన రూ.1,627 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతంగా నమోదైంది.