న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపనున్నదని బ్యాంకింగ్ యూనియన్ ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. కానీ, బ్యాంకు ఉన్నతస్థాయి ఉద్యోగులు మాత్రం ఈ సమ్మెలో పాల్గొనక పోవడం విశేషం. ఈ సమ్మెపై ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లు తమ ఖాతాదారులకు సమాచారం ఇచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ము, భద్రతకు విఘాతం కలుగుతాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు. తమ ఆందోళన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో సమ్మె చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు, ఈ సమ్మెలో ప్రైవేట్ రంగ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొనడం లేదు.