న్యూఢిల్లీ, జూలై 26: భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎగుమతిదారైన భారత్ నుంచి బాస్మతీయేతర బియ్యం రాకకు బ్రేకులుపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కొరతకు దారితీయగా, అమెరికాసహా ఆయా దేశాల్లో బియ్యం కోసం కొట్టుకుంటున్న దృశ్యాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కోట్లాది మందికి అన్నమే ప్రధాన ఆహారం. దీంతో ప్రస్తుత పరిస్థితులు ఆయా దేశాల్లో వైట్ రైస్ షార్టేజ్తోపాటు ద్రవ్యోల్బణానికీ దారితీస్తున్నాయి.
ఇతర ఎగుమతిదారులపై ప్రభావం
బియ్యం ఎగుమతులపై భారత్ తీసుకున్న నిషేధం.. చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, థాయ్లాండ్, కొన్ని ఆఫ్రికా దేశాల ఎగుమతులనూ ప్రభావితం చేయవచ్చని గ్లోబల్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వియత్నాం టన్ను బియ్యం ధరను 600 డాలర్లకు పెంచింది. థాయ్లాండ్లోనూ దాదాపు రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ టన్ను 534 డాలర్లకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు దశాబ్దం గరిష్ఠాన్ని చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే బియ్యం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో గోధుమలు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయోత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నది.
క్షీణించిన ఎగుమతులు
బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ఎగుమతులు క్షీణించాయి. ఇప్పటికే నూకల ఎగుమతులపై మోదీ సర్కారు ఆంక్షలు పెట్టగా, మొత్తం దేశ ఎగుమతులు 30-40 శాతం ప్రభావితమైనట్టు చెప్తున్నారు. అయితే ఈ రకమైన చర్యలు దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నోమురా హోల్డింగ్స్ హెచ్చరిస్తున్నది. కాగా, భారత్ నుంచి కొన్ని దేశాలకు ఇప్పటికీ బియ్యం ఎగుమతులు సాగుతున్నాయి. ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తితో జరుగుతున్నదంటున్నారు. దీంతో దౌత్యపరమైన విధానాలతో భారత్ నుంచి బియ్యం దిగుమతులను చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయా దేశాలకు ఐక్యరాజ్య సమితి వర్గాలు సూచిస్తున్నాయి.
వరి సాగులో తెలంగాణ టాప్
వరి సాగులో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రాష్ట్రంలో 57.40 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే దాదాపు 22 లక్షల ఎకరాలు పెరగడం గమనార్హం. నాడు 35.83 లక్షల ఎకరాల్లో వరి పండింది. అలాగే దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 2021-22లో 36.34 శాతంగా ఉంటే, 2022-23లో 42.22 శాతంగా ఉన్నది. ఇక తెలంగాణ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ ఉన్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో వ్యవసాయం పండుగలా తయారవుతున్న విషయం తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా వంటివి ఇందుకు కలిసొస్తున్నాయి. స్వయంగా రైతైన సీఎం కేసీఆర్.. వరితోపాటు ఇతర పంటల విస్తరణకూ కృషి చేస్తున్న సంగతి విదితమే.
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్దే గత ఆర్థిక సంవత్సరం చైనాలో 145.95 మిలియన్ టన్నులు, భారత్లో 125 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగినట్టు అంచనా అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే చైనాలో 3.04 మిలియన్ టన్నులు, భారత్లో 5.29 మిలియన్ టన్నులు తగ్గిన ఉత్పత్తి
‘బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మున్ముందు ఇంకా పెరుగుతాయి. అయితే ఈ రేట్లు ఎక్కడిదాకా వెళ్తాయో ఇప్పుడే చెప్పలేం’
–థాయ్లాండ్
బియ్యం ఎగుమతిదారుల సంఘం ‘ఆసియా, ఆఫ్రికా దేశాల్లో బియ్యం కొరత ఏ స్థాయికి చేరవచ్చన్నది.. ఎగుమతులపై భారత్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’
–యూఎన్ ఆహార, వ్యవసాయ విభాగం నిపుణులు
‘భారత్ ఎగుమతుల నిషేధం నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆసియా, ఇతర దేశాల్లోనూ ధరల పెరుగుదలకు అది కారణం కాగలదు’
-అంతర్జాతీయ మార్కెట్లోని వ్యాపారులు