ముంబై, జనవరి 3: బజాజ్ ఆటో అమ్మకాలు గత నెలలో 3 శాతం క్షీణించాయి. డిసెంబర్లో 3,62,470 యూనిట్లుగా నమోదైనట్లు సోమవారం సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్లో 3,72,532 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈసారి అమ్మకాల్లో ద్విచక్ర వాహనాలు 3,18,769 యూనిట్లుగా, వాణిజ్య వాహనాలు 43,701 యూనిట్లుగా ఉన్నాయి. అయితే టూవీలర్ సేల్స్ 6 శాతం పడిపోతే, కమర్షియల్ వెహికిల్ సేల్స్ 29 శాతం పెరిగాయి. కాగా, ఈసారి దేశీయ అమ్మకాలు 5 శాతం పెరిగి 1,45,979 యూనిట్లకు చేరాయి. అంతకుముందు 1,39,606 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 7 శాతం పతనమై 2,16,491 యూనిట్లుగా ఉన్నాయి. ఇక గతేడాది మొత్తంగా సంస్థ విదేశీ అమ్మకాలు 30 శాతం పుంజుకుని 25లక్షలకుపైగా నమోదయ్యాయి.
టయోటా కిర్లోస్కర్
టయోటా కిర్లోస్కర్ మోటర్ వాహన విక్రయాలు డిసెంబర్లో 45 శాతం ఎగిసి 10,832 యూనిట్లకు చేరాయి. 2020 డిసెంబర్లో 7,487 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు మొత్తంగా 1,30,768 వాహనాలను సంస్థ అమ్మింది. 2020తో పోల్చితే 72 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక వాణిజ్య వాహన సంస్థ అశోక్ లేలాండ్ డిసెంబర్లో 12,518 యూనిట్లను విక్రయించింది. 2020 డిసెంబర్తో చూస్తే 2 శాతం తగ్గాయి. ఇదిలావుంటే కియా ఇండియా గతేడాది మొత్తంగా 2,27,844 యూనిట్లను అమ్మింది. 2020తో పోల్చితే 28 శాతం పెరిగాయి. మరోవైపు ఆడీ ఇండియా కూడా 2021లో 3,293 యూనిట్లను విక్రయించింది. గతంతో చూస్తే రెండు రెట్లు పెరగడం గమనార్హం.