ముంబై, అక్టోబర్ 4: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు చర్చించిన మీదట అక్టోబర్ 6 శుక్రవారం ఉదయం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ఎంపీసీ వెల్లడిస్తుంది. ఈ దఫా సమీక్షలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా అట్టిపెడుతుందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ అంశాలు, గరిష్ఠ ద్రవ్యోల్బణం కారణంగా రేట్ల తగ్గింపు ఉండబోదని, అలాగే పెంచే అవకాశం లేదని, రెపో రేటును 6.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 మే నెల నుంచి వరుసగా 250 బేసిస్ పాయింట్ల మేర పెంచిన ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి చేర్చింది. అప్పటినుంచి మూడు వరుస సమీక్షల్లో రేట్లలో మార్పేదీ చేయలేదు.
ఈ దఫా పరపతి విధానం, రేట్ల తీరు యథాతథంగా కొనసాగుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నావిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా 6.8 శాతం గరిష్ఠస్థాయి వద్ద ఉందని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇది బాగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, పప్పుదినుసుల ఖరీఫ్ దిగుబడి బాగా తగ్గనున్నందున, ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ పరిణామాల నడుమ ఎంపీసీ రెపో రేటు తగ్గించడానికి చాలా సమయం వేచిచూడాల్సి వస్తుందని మదన్ అంచనా వేశారు. పాలసీ రేటును ఎంపీసీ యథాతథంగా కొనసాగిస్తుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు.
గత పాలసీ సమీక్ష తర్వాత పశ్చిమ దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగినందున, దేశీయ మార్కెట్ల నుంచి నిధు లు తరలివెళ్లడం, ఫారెక్స్ నిల్వలు తరిగిపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటి ప్రభావాల కారణంగా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తుందని కార్తీక్ వివరించారు. ఎంపీసీలో ముగ్గురు ఆర్బీఐ అధికారులు, మరో ముగ్గురు కేంద్రం నియమించిన ఆర్బీయేతర సభ్యులు ఉంటా రు. శశాంక్ భిడే, అషిమా గోయిల్, జయంత్ వర్మలు వెలుపలివారు కాగా, గవర్నర్ దాస్తో పాటు ఆర్బీఐ అధికారులు..ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్ర ఎంపీసీ సభ్యులు.