Singareni | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదేండ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకోసం అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాలపై తమ సంపూర్ణ సహకారం అందించడానికి ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ముందుకొచ్చింది. ఈ మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక అంశాలపై ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్తో సింగరేణి సీఎండీ బలరామ్ సమావేశమయ్యారు.
ప్రస్తుతం సంస్థ వినియోగిస్తున్న సాంకేతిక, ఈ ఏడాది సాధించిన ప్రగతి, వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్ రంగంలోకి అడుగుపెట్టిన విషయాన్ని ఆయన వివరించారు. మరోవైపు, వచ్చే నవంబర్లో ఆస్ట్రేలియా బృందం సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నదని, దీంట్లోభాగంగా కంపెనీ వినియోగిస్తున్న టెక్నాలజీ, నూతన వ్యాపార విస్తరణ చర్యలను స్వయంగా తెలుసుకోనున్నట్లు ఆస్ట్రేలియా కమిషనర్ తెలిపారు.