న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ చైర్మన్ పదవికి అటాను చక్రవర్తి రాజీనామా చేశారు. గత రెండేండ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్దతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు కానీ, వ్యక్తిగత భావజాలం, బ్యాంక్ అనుసరిస్తున్న పద్దతులు ఒకేలా లేకపోవడంతో తప్పుకోవాలని నిర్ణయించినట్టు ఈ నెల 17న రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2021లో బ్యాంక్లో చేరిన ఆయన.. 2024లో మరో మూడేండ్లపాటు తన పదవిని పొడిగించారు.
మరోవైపు, బ్యాంక్లో జరుగుతున్న పరిణామాలపై వెంటనే బోర్డు సమావేశమై తాత్కాలిక నూతన చైర్మన్గా కేకే మిస్త్రీని ప్రకటించింది. ఈ నెల 19 నుంచి మూడు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నియామకానికి రిజర్వు బ్యాంక్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేకే మిస్త్రీ మాట్లాడుతూ..బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని స్పష్టంచేశారు. బ్యాంకులో జరుగుతున్న పరిణామాలపై రిజర్వు బ్యాంక్, మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, తగినంత మూలధన నిధులు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టంచేసింది.