న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నవంబర్లోనూ రూ.1.31 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే 25 శాతం అధికమని పేర్కొంది. అలాగే వరుసగా ఐదో నెలలోనూ లక్ష కోట్ల రూపాయల కంటే అధికంగా వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద పన్ను వసూలు ఇదే కావడం విశేషం. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదుటపడుతుండటం, వ్యాపార సానుకూల పరిస్థితులు నెలకొనడం ఇందుకు దోహదం చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో వసూలైన రూ. 1,31,526 కోట్ల జీఎస్టీ వసూళ్ళలో సీజీఎస్టీ కింద రూ.23,978 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.31,127 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో రూ.9,606 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.1,39,708 కోట్లు వసూలయ్యాయి. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి.
మరోవైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు నెలల జీఎస్టీ వసూళ్ళ గణాంకాలను మార్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలలో వసూలైన జీఎస్టీ గణాంకాలను సవరించింది. గతంలో ఏప్రిల్లో రూ.1.41 లక్షల కోట్లు వసూలైనట్లు వెల్లడించగా ప్రస్తుతం దీనిని రూ.1,39,708 కోట్లకు కుదించింది. అలాగే మే నెలలోనూ రూ.1.02 లక్షల కోట్లకు బదులుగా రూ. 97,821 కోట్లు, జూన్ నెలలో రూ. 92,849 కోట్లకు బదులుగా రూ.92,800 కోట్లకు తగ్గించింది.