న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహించే ఈక్విటీ స్కీముల్లోకి డిసెంబర్ నెలలో రూ.16,997 కోట్లు తరలివచ్చాయి. ఈ స్కీమ్ల్లోకి నవంబర్లో వచ్చిన రూ.15,536 కోట్లతో పోలిస్తే డిసెంబర్లో 9.40 శాతం వృద్ధిచెందాయి. మరోవైపు డిసెంబర్లో ఫండ్స్ నిర్వహణలోని డెట్ స్కీమ్ల నుంచి భారీగా రూ.75,556 కోట్లు తరలివెళ్లాయి. ఇందులో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.39,675 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కు తీసుకున్నారు. హైబ్రీడ్ ఫండ్ క్యాటగిరీ స్కీమ్లోకి మాత్రం రూ. 15,009 కోట్లు వచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ రూ.10,645 కోట్లు ఆకర్షించాయి. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లోకి రూ.2,420 కోట్లు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లోకి రూ.1,369 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్, హైబ్రీడ్ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు తరలివెళ్లినప్పటికీ, ఈక్విటీ మార్కెట్ జరిపిన భారీ ర్యాలీ కారణంగా ఈక్విటీ స్కీముల నికర ఆస్తుల విలువ పెరగడంతో ఫండ్స్ మొత్తం ఆస్తుల్లో వృద్ధి సాధ్యపడింది.