Ashneer Grover | భారత్ పే మాజీ కో ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న ఆదాయం పన్ను విధానం, ఇతర పన్నుల వసూళ్ల వ్యవస్థపై నిప్పులు చెరిగారు. మొబైల్ పేమెంట్ యాప్ ‘భారత్ పే’ స్థాపకుల్లో ఒకరైన అశ్నీర్ గ్రోవర్.. మోసపూరిత లావాదేవీలు నిర్వహించారన్న ఆరోపణలపై సొంత సంస్థ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. భారత్ పే సంస్థలో ఆయన పనితీరు, లాభాలతో వచ్చిన పేరు ప్రతిష్టల కంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పన్నుల వ్యవస్థ.. వేతన జీవులకు శిక్ష వంటిదేనని అశ్నీర్ గ్రోవర్అభిప్రాయ పడ్డారు. వేతన జీవుల తాము సంపాదిస్తున్న ఆదాయంలో 10 నుంచి 35 శాతం ఆదాయం పన్ను చెల్లిస్తున్నారని, ప్రతిఏటా ఐదు నెలల పాటు ప్రభుత్వం కోసమే పని చేస్తున్నారని అన్నారు.
రూ.10 ఆదాయం సంపాదిస్తే అందులో రూ.4 పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ పే చేస్తున్నారని అశ్నీర్ గ్రోవర్ చెప్పారు. వ్యాపారవేత్తలు పన్నుల చట్రం నుంచి తప్పించుకుని స్మార్ట్గా వ్యవహరించడం ఎలాగో తెలుసునన్నారు. కానీ వేతన జీవులు టీడీఎస్ చెల్లించడం తప్ప, మరో ఆప్షన్ లేదని చెప్పారు.
వేతన జీవులు పన్ను చెల్లించడం ఒక విరాళంగా చేస్తున్నారే తప్ప, దాని వల్ల వారికి ఒనగూడే ప్రయోజనాలేం లేవని అశ్నీర్ గ్రోవర్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ నాయకుడినైతే పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరి నుంచి 15 శాతం పన్ను తప్పనిసరి వసూలు చేస్తామన్న నిబంధన తెస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. విదేశాల్లో క్రెడిట్ కార్డు వాడకంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్ని కూడా అశ్నీర్ గ్రోవర్ తప్పు పట్టారు. కానీ రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు మాత్రం పన్ను ఉండదంటూ ఎద్దేవా చేశారు.