Jaguar Land Rover | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నదంటూ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా, ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అమెజాన్ 11 వేల మందిని, మెటా పదివేల మందిని, ట్విట్టర్ సగం మందిని తొలగించాయి.. తొలగించే పనిలో పడ్డాయి. కానీ, ఒక సంస్థ మాత్రం భిన్నంగా రియాక్టయింది. ఆ సంస్థ టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ అండ్ రోవర్ (జేఎల్ఆర్). కొత్తగా 800 మందికి పైగా న్యూ డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో నియమించుకుంటామని శుక్రవారం ప్రకటించింది.
బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా, భారత్, చైనా, హంగేరీ తదితర దేశాల్లోని యూనిట్లలో ఈ నియామకాలు చేపడతామని జాగ్వార్ లాండ్ అండ్ రోవర్ పేర్కొంది. డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి స్కిల్డ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా డిజిటల్- ఫస్ట్ అండ్ డేటా డ్రైవెన్ ఆర్గనైజేషన్గా నిలువనున్నది.
టెక్నాలజీ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు వార్తలొస్తున్నాయి. టెక్ పరిశ్రమలో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణుల కోసం జాగ్వార్ లాండ్ రోవర్ కొత్తగా జాబ్స్ పోర్టల్ ప్రారంభించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కెరీర్ అవకాశాలు కల్పిస్తూ.. హైబ్రీడ్ వర్కింగ్ ప్యాటర్న్స్తో ఉద్యోగ అవకాశాలు ఆఫర్ చేస్తున్నది.
అటానమస్ డ్రైవింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎలక్ట్రిఫికేషన్, క్లౌడ్ సాఫ్ట్వేర్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా జేఎల్ఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నది. ‘మా డేటా, డిజిటల్ స్కిల్స్ బేస్ను మరింత బలోపేతం చేయ తలపెట్టాం’ అని జేఎల్ఆర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంథోనీ బాటిల్ తెలిపారు.