హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్..తాజాగా హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో లండన్ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సెంటర్ సంస్థకు రెండోది కావడం విశేషం. ఇందుకు సంబంధించి దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎనకమిక్ ఫోరం(ప్రపంచ ఆర్థిక వేధిక)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్లు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషిన్(ఆర్పీఏ), బ్లాక్ చెయిన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషించనుంది. దీంతో పాటు మారెటింగ్, తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవడంతో పాటు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరుచడానికి ఈ కేంద్రం దోహదం చేయనున్నది.
‘వినూత్న ఆవిష్కరణలకు ఊతం: కేటీఆర్
టీ హబ్, వీ హబ్, టీ వర్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థలతో వినూత్న ఆవిషరణలకు ఊతం ఇచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ తెలంగాణలో ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ దీనికి సరైన జోడింపుగా ఉంటుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. లండన్ తరువాత డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటునకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకుగాను అపోలో నీరజ్ కన్వర్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
‘వచ్చే మూడేండ్లలో నిర్దేశించుకున్న లక్ష్యంలో డిజిటలైజేషన్ కీలకమైనది. లండన్ తరువాత హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం మా డిజిటల్ వ్యూహంలో భాగమే. ఈ కేంద్రం ఏర్పాటునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిషరించడంలో ఈ ఇన్నోవేషన్ సెంటర్ కీలకంకానున్నది. ఈ రెండు ఇన్నోవేషన్ సెంటర్లలో వ్యూహాత్మక డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి కోసం ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంబంధిత ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం’
– నీరజ్ కన్వర్, అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ