న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి వ్యతిరేకంగా మరో కేసు నమోదైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్పై సీబీఐ కొత్తగా మరో కేసును దాఖలు చేసింది. బ్యాంకునకు 2013-17 మధ్యకాలంలో రూ.2, 200 కోట్ల నష్టం కలిగించారని అధికారులు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ నివాసం, ఆర్కామ్ కార్యాలయల్లో సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ దుర్వినియోగం చేయడం వల్ల సంస్థకు రూ.2,220 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ రుణాలను మోసపూరిత ఖాతాల ద్వారా దారి మళ్లించినట్టు సీబీఐ గుర్తించింది. ఈ ఖాతాను 2017లోనే నిరర్థక ఆస్తిగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. మరోవైపు, ఈ ఖాతాలను మోసపూరితమని ప్రకటించడంపై అనిల్ అంబానీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం స్టే విధించింది. మరోవైపు, ఆర్కామ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్ సంయుక్తంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ వద్ద రూ.31,580 కోట్ల రుణం పొందాయి. వీటిలో రూ.6,265.85 కోట్లను ఇతర బ్యాంకుల రుణాలను తిరిగి చెల్లించడానికి వినియోగించగా, మిగతా రూ.5,501. 56 కోట్లను ఇతర చెల్లింపులకు కేటాయించింది. అలాగే రూ.3,674.85 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టింది.
మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గురువారం ఈడీ ముందు హాజరయ్యారు. 66 ఏండ్ల వయస్సు కలిగిన అనిల్ అంబానీని ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు సుమారు 9 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. అలాగే శుక్రవారం ఉదయం కూడా ఈడీ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఆయన ఈడీ ముందు హాజరుకావడం ఇది రెండోసారి. రూ.40 వేల కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఆగస్టు 2025లో తొలిసారి ఈడీ ప్రశ్నించింది.