తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 1,310.62 పాయింట్లు పెరిగి 83,580.40 దగ్గర నిలిచింది. నిఫ్టీ 373.05 పాయింట్లు అందుకుని 25,693. 70 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా కొనుగోళ్ల ఉత్సాహంతోనే మార్కెట్లు ముం దుకు సాగవచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్లతో వాణిజ్య ఒప్పందాలు.. దేశ ఎగుమతులకు తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయన్న అభిప్రాయాలు మదుపరులలో నెలకొన్నాయి. దీంతో మరిన్ని పెట్టుబడులకు వీలుందంటున్నారు.
ప్రధానంగా ఆటో, ఫార్మా రంగాల షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయన్న విశ్లేషణలున్నాయి. పైగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బాగా కోలుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తున్నది. అయితే ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించే వీలు లేకపోలేదు. ఎప్పట్లాగే విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు ముఖ్యమే. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీ కి 25,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,200 పా యింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,900-26,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.