Ambani-Adani | న్యూఢిల్లీ, మార్చి 28: దేశీయ ప్రముఖ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు తొలిసారిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గౌతమ్ అదానీకి చెందిన మధ్యప్రదేశ్ పవర్ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. అదానీ పవర్ లిమిటెడ్నకు చెందిన మహాన్ ఎనర్జీ లిమిటెడ్లో రూ.10 ముఖ విలువ కలిగిన 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ హస్తగతం చేసుకున్నది. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ విద్యుత్ యూనిట్ను అదానీ పవర్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది.
20 ఏళ్లకు రిలయన్స్తో ఒప్పందం కుదిరినట్లు అదానీ గ్రూపు స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చాయి. 2,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ను క్యాప్టివ్ యూనిట్ కోసం కేటాయించినట్లు తెలిపింది. సాధారణంగా క్యాప్టివ్ జనరేటింగ్ ప్లాంట్ నుంచి సొంత అవసరాలకు విద్యుత్ను వినియోగించాలంటే ఆ కంపెనీలో 26 శాతం వాటా ఉండాలనే నిబంధన ఉన్నది. ఈ విద్యుత్ను దేనికోసం వినియోగిస్తున్న విషయాన్ని మాత్రం రిలయన్స్ వెల్లడించలేదు. మరోవైపు చమురు, గ్యాస్, రిటైల్, టెలికం రంగంలో ముకేశ్ అంబానీ వ్యాపారాలు నిర్వహిస్తుండగా…గౌతమ్ అదానీ రేవులు, విమానాశ్రయాలు, బొగ్గు, గనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ క్లీన్ ఎనర్జీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.