గత వారం మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడంతో నెమ్మదిగా 5 వారాల శ్రేణి నుంచి సూచీలు బ్రేక్అవుట్ జరిపినప్పటికీ, అది విఫలమయ్యింది. గురువారం 18,135 పాయింట్ల గరిష్ఠస్థాయి వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వారాంతంలో 18,000 దిగువకు జారిపోయింది. చివరకు 17,944 పాయింట్ల వద్ద ముగిసింది. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఒక వైపు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు మరో వైపు మార్కెట్ను నిరోధించాయని విశ్లేషకులు చెప్పారు. అమెరికాలో వెలువడుతున్న జాబ్స్, ఇన్ఫ్లేషన్ గణాంకాల కారణంగా ఈ ఏడాది ఫెడ్ మరో మూడు దఫాలు వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల కదలికలు, ఇక్కడ ఫిబ్రవరి 23నాటి డెరివేటివ్ సీరీస్ ముగింపు ప్రభావం మన మార్కెట్పై ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పలు మూవింగ్ ఏవరేజ్లు 18,000-18,100 మధ్యనే ఉన్నందున, ఈ కీలక నిరోధ శ్రేణిని బలంగా అధిగమిస్తేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుందని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ చెప్పారు. ఈ వారం నిఫ్టీ 18,100 స్థాయిని దాటితే 18,250 పాయింట్ల వరకూ పెరగవచ్చని, 17,900, 17,780 స్థాయిలు మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేశారు. యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ రాజేష్ పాల్వియా తన అంచనాల్ని వెల్లడిస్తూ ఈ వారం నిఫ్టీకి 18,000-18,050 నిరోధం కీలకమన్నారు. 17,850-18,870 శ్రేణి వద్ద కొనుగోలు మద్దతు లభించవచ్చన్నారు.