న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. ఎయిర్లైన్స్లు సులభతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయని, అలాగే ప్రయాణికుల రైట్స్కు పెద్దపీట వేయడం కూడా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
నిర్వహణ ఖర్చులు అధికం కావడం, దూరపు రూట్లలో సర్వీసులు అందించడం ఎయిర్లైన్స్కు పెద్దభారంగా మారుతున్నదని, అయినప్పటికీ భవిష్యత్తులో మంచి రోజులు రావచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎయిర్లైన్స్ల సమస్యలు మరింత పెరిగాయన్నారు. దేశంలో ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు దివాలా తీశాయని, ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ విమానయాన రంగంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని, డీజీసీఏ, పౌర విమానయాన నియంత్రణ మండలి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఇటీవలకాలంలో దేశీయంగా నడిచే విమాన సర్వీసుల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు విధించకుండా నియంత్రించినట్టు చెప్పారు.
ప్రముఖ విమానయాన తయారీ సంస్థ ఎంబ్రాయిర్ బాటలోనే ఎయిర్బస్.. భారత్లో అసెంబ్లింగ్ లైన్ను ఏర్పాటు చేయడానికి ఎయిర్బస్ ముందుకొచ్చింది. ప్రాంతీయ విమానయాన సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ..ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎఫ్ఏఎల్..టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలిసి రెండు యూనిట్లను నిర్వహిస్తున్నది.