న్యూఢిల్లీ, జనవరి 26: టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియాను గురువారం కేంద్ర ప్రభుత్వం అప్పగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఇందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తయ్యాయని చెప్పాయి. కాగా, దాదాపు 69 ఏండ్ల తర్వాత మళ్లీ టాటాల గూటికే ఎయిర్ ఇండియా వెళ్తుండటం గమనార్హం. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను అమ్మేయాలని కేంద్రం చాలా ఏండ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మోదీ సర్కారు రాకతో ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలోనే పలుమార్లు ఎయిర్ ఇండియాను అమ్మాలని చూసినా.. ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. ఈ క్రమంలో ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 8న పోటీ బిడ్డింగ్లో టాటాలు సొంతం చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,000 కోట్లకు ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను దక్కించుకున్నది. ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను జారీ చేసిన కేంద్రం.. అక్టోబర్ 25నే ఈ డీల్కు సంబంధించి షేర్ పర్ఛేజ్ అగ్రిమెంట్పైనా సంతకాలు చేసింది. ఇప్పటికే ఎయిర్ ఏషియా, విస్తారాల్లో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా మొత్తం సొంతమవగా, టాటాల నిర్వహణలో నడువనున్న మూడో విమానయాన సంస్థగా నిలువనున్నది. ఇదిలావుంటే ఇండియన్ పైలట్స్ గిల్డ్, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్లు ఎయిర్ ఇండియా రికవరీ ప్రక్రియను అక్రమంగా ఆరోపించాయి.
ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తోపాటు మూతబడ్డ ఎయిర్ ఇండియా సాట్స్లో 50% శాతం వాటా టాటా గ్రూప్నకు వస్తుంది.
1932 అక్టోబర్ 15న టాటా ఎయిర్లైన్స్గా ఎయిర్ ఇండియా ప్రస్థానం మొదలైంది.
1953లో టాటాల నుంచి మెజారిటీ వాటాను పొంది ఎయిర్ ఇండియాను జాతీయం చేసింది.
2007లో ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేశారు.