Air India | కొత్త పైలట్లు, క్రూ సిబ్బంది కోసం టాటా సన్స్ వారి ఎయిర్ ఇండియా నియామక ప్రక్రియ చేపట్టింది. ఇటీవలే ప్రముఖ విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్బస్ల నుంచి 470 కొత్త విమానాల కొనుగోలుకు ఆ సంస్థలతో ఎయిర్ ఇండియా ఒప్పందాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో అందుబాటులోకి వచ్చే విమానాల్లో పని చేసే పైలట్లు, ఇతర సహాయ సిబ్బంది కోసం నియామక ప్రక్రియను మహారాజా చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఎయిర్ ఇండియా యాజమాన్యం 140 మంది సపోర్ట్ స్టాఫ్ కలిగి ఉంది. కొత్తగా నియమించుకునే ఉద్యోగాల్లో కొన్నింటికి రూ.2 కోట్లకు పైగా వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
బోయింగ్ విమానం నడిపేందుకు ఎయిర్ ఇండియా `బీ777 కెప్టెన్` కోసం ఎదురుచూస్తున్నది. ఎయిర్ ఇండియా విమాన కెప్టెన్గా నియమితులయ్యే వ్యక్తికి రూ.2 కోట్లకు పైగా వార్షిక వేతన ప్యాకేజీ చెల్లిస్తుంది. బీ777 విమానం నడిపే పైలట్ల నుంచి ఫస్ట్ ఆఫీసర్స్ వరకు నియామకాలు చేపడుతున్నది. ఆసక్తి గల అభ్యర్థులకు నెలకు రూ.17,39,118 (21 వేల డాలర్లు) చొప్పున.. ఏడాదికి రూ.2,08,69,416 చెల్లిస్తారు.
నిపుణులైన పైలట్ల కొరత కారణంగా అధిక వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారంటూ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫైడ్ పైలటర్ల కోసం భారీ గిరాకీ ఉందన్నారు. ఒక స్పెషల్ ఫ్లయిట్ నడిపేందుకు ప్రతి పైలట్ ఏటా.. 5000 గంటల నుంచి 7000 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. వీరితోపాటు క్యాబిన్ క్రూ మెంబర్స్, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టెక్నికల్ సిబ్బందినీ నియమించుకోనున్నది ఎయిర్ ఇండియా. బోయింగ్, ఎయిర్బస్లతో విమానాల కొనుగోలు ఒప్పందం వల్ల భారత్ పౌర విమానయాన రంగంలో భారీ మొత్తంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ప్రస్తుతం 113 విమానాలు గల ఎయిర్ ఇండియాలో 1600 మంది పైలట్లు పని చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు ఆలస్యం కావడమో, రద్దు చేయడమో చేస్తున్నారు. ఏ350 విమానాలకు ఎయిర్ ఇండియా 1200 మంది, 20 బోయింగ్ 787 విమానాలకు 400 మంది పైలట్లు.. ఈ లెక్కన 400 విమానాలకు 4800 మంది పైలట్లను ఎయిర్ ఇండియా నియమించుకోవాల్సి ఉంటుంది.