Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యులేటర్ సెంటర్పై చర్యలు తీసుకున్న 72 గంటల్లోనే హైదరాబాద్ సెంటర్పై ఆంక్షలు విధించడం గమనార్హం. అయితే, ఈ కేంద్రంలో పైలెట్లకు ఇచ్చే శిక్షణలో కొన్ని లోపాలున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో ఆయా సిమ్యులేటర్ ఫెసిలిటీ సెంటర్లలో శిక్షణా కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా ముంబయిలో కేంద్రంలో బోయింగ్ 777, బీ787 విమాన పైలెట్లకు, హైదరాబాద్లో ఎయిర్బస్ ఏ-320 విమాన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది.
ప్రస్తుతం రెండు కీలకమైన ఫిసిలిటీ సెంటర్లలో కార్యకలాపాలు నిలిపివేయడంతో ఎయిర్ ఇండియాకు శిక్షణకు సంబంధించి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా స్పందించలేదు. తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో వైపు ఎయిర్ ఇండియాలో తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇటీవల ఇద్దరు సభ్యులు డీజీసీఏ బృందం ఎయిర్లైన్ అంతర్గత భద్రతా ఆడిట్ రిపోర్టులో లోపాలను గుర్తించింది. రెగ్యులేటర్ దీన్ని పరిశీలిస్తున్నది.