Air India | ఎయిర్ ఇండియా యాజమాన్యం తీరుపై సంస్థ పైలట్లు కినుక వహించారు. తమ వేతనాలు, సర్వీసు నిబంధనలపై యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరసన తెలుపుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా జోక్యం చేసుకోవాలని కోరారు. 1500 మందికి పైగా పైలట్ల సంతకాలు చేసిన పిటిషన్ సమర్పించారు. ప్రస్తుత యాజమాన్యంలోని హెచ్ఆర్ టీం తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి పరిహార ప్యాకేజీని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ నెల 17న ప్రకటించింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం తీసుకొచ్చిన ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ), ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపీజీ) తిరస్కరించాయి. పని చేస్తున్న సిబ్బందికి నూతన కాంట్రాక్టులను ఖరారు చేయడానికి ముందు తమను యాజమాన్యం సంప్రదించడం లేదని, కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆ యూనియన్లు ఆరోపించాయి.
ఎయిర్ ఇండియా యాజమాన్యం నిర్ణయించిన కొత్త కాంట్రాక్ట్, వేతన స్ట్రక్చర్ను ఆమోదించొద్దని, వాటికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయొద్దని ఎయిర్ ఇండియా ఉద్యోగ సంఘాల నాయకులను పైలట్ల సంఘాలు కోరాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిర్ ఇండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసుకున్న సంగతి
తమ గౌరవాన్ని, హుందాతనాన్ని యాజమాన్యం గుర్తించడం లేదని, దీనివల్ల తమ నైతిక స్థైర్యం దెబ్బ తింటుందని ఐసీపీఏ, ఐపీజీ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుత యాజమాన్యం తీరుతో తమ విధుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయా సంఘాల సభ్యులు వాపోయారు. ఎయిర్ ఇండియా పురోభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి తాము ఎల్లవేళలా కట్టుబడి ఉన్నామని పైలట్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లను తాము అర్థం చేసుకోగలమని పైలట్లు పేర్కొన్నారు. భాగస్వాములందరికీ లబ్ధి చేకూరేలా పరిష్కార మార్గాలు కనుగొనేందుకు కంపెనీ యాజమాన్యంతో కలిసి పని చేసేందుకు సిద్ధం అని తెలిపారు. తమ ఆందోళనను ప్రస్తుత హెచ్ఆర్ టీం వినేందుకు సిద్ధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రతన్ టాటాను కోరారు.