Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గ్రూప్ సేవల విస్తరణ దిశగా వడివడిగా దూసుకెళ్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 650 మంది పైలట్లను నియమించుకున్నట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. దీంతోపాటు ఈ వారంలో ఎయిర్ ఇండియా జాబితాలో మరో రెండు వైడ్బాడీ బోయింగ్ 777 విమానాలు జత కలువనున్నాయి. అమెరికాకు విమాన సర్వీసులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (మాజీ ఎయిర్ ఏషియా ఇండియా) సంస్థ మాతృ సంస్థ ఎయిర్ ఇండియా గ్రూప్. ఉత్తర అమెరికాకు సర్వీసులు పెంచేందుకు గతేడాది ఎయిర్ ఇండియా 11 బీ777, ఆరు బీ777-300ఈఆర్, ఐదు బీ777-200 ఎల్ఆర్ విమానాలను లీజుకు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే నేలకు పరిమితమైన మూడు బోయింగ్ 787 విమానాల్లో రెండు విమానాలతో సర్వీసులు ప్రారంభిస్తామని క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించారు.
స్పాట్ చెక్లో లోపాలు కనిపించడంతో ఎయిర్ ఇండియా ముంబై, హైదరాబాద్ యూనిట్లలో శిక్షణ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 650కి పైగా పైలట్లను విజయవంతంగా నియమించుకున్నామని క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఈ వారంలో రెండు బోయింగ్ 777 విమానాలు తమ సర్వీసులు వస్తాయన్నారు. ఏడాది చివరిలోగా ఐదవ, ఆరవ యూనిట్ బోయింగ్ విమానాలు వచ్చి చేరతాయని తెలిపారు. రెండు 777-200 ఎల్ఆర్ విమానాల్లో ఒక విమానాన్ని నార్త్ అమెరికా రూట్లలో నడుపుతామన్నారు. ఆరు న్యూ బీ777-300ఈఆర్ విమానాల్లో మొదటి విమానాన్ని ఇతర రూట్లలో సేవల విస్తరణకు ఉపయోగిస్తామని చెప్పారు.