Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది. ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఐదేండ్ల పరివర్తన ప్రణాళికలో భాగంగా `మహారాజా` కొత్త నియామకాలు చేపట్టింది. తాజాగా 11 అంతర్జాతీయ రూట్లతోపాటు 16 కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియా `శిఖ`లో కొత్తగా నాలుగు ఏ320 నియోస్, 14 ఏ321 నియోస్, ఎనిమిది బీ777, మూడు ఏ350 విమానాలు జత కలిశాయి. ఏడాది కాలంలో నియమించుకున్న వారిలో క్యాడెట్ పైలట్లు అమెరికాలోని భాగస్వామ్య ఫ్లయింగ్ స్కూళ్లలో శిక్షణ పొందారు. వారిలో తొలి బ్యాచ్ ఈ నెలాఖరులో విధుల్లో చేరతారని ఎయిర్ ఇండియా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ శుక్రవారం సిబ్బందికి పంపిన మెసేజ్లో తెలిపారు.
ప్రైవేటీకరణ తర్వాత నియమితులైన క్యాబిన్ టీం తమ శిక్షణ పూర్తి చేసుకుని సర్వీసులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని క్యాంప్బెల్ విల్సన్ చెప్పారు. ఐదేండ్ల విహాన్.ఏఐ ప్లాన్లో భాగంగా ఎయిర్ ఇండియా 3800 మందికి పైగా ఫ్లయింగ్ స్టాఫ్, 1950 మందికి పైగా నాన్ ఫ్లయింగ్ సిబ్బందిని నియమించుకున్నది.
ఇదిలా ఉంటే, టాటా సన్స్ ఆధీనంలోని బడ్జెట్ క్యారియర్ విస్తారా ఎయిర్ లైన్స్ను ఎయిర్ ఇండియాలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విస్తారా పైలట్ల వేతన సవరణతోపాటు పలు అంశాలపై విస్తారా పైలట్లు సమ్మెకు దిగారు. విస్తారా పైలట్ల సమ్మెకు రెండు ఎయిర్ ఇండియా యూనియన్లు మద్దతు పలికాయి. పైలట్ల సమ్మె కారణంగా విస్తారా యాజమాన్యం పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నది. విస్తారా పైలట్లను యాజమాన్యం బాండెడ్ లేబర్గా పరిగణిస్తున్నదని ఎయిర్ ఇండియా యూనియన్లు ఆరోపిస్తున్నాయి. పైలట్ల ఫ్లయింగ్ అలవెన్స్ 40 గంటలకు కుదించడం, లీవ్ అప్రూవల్స్ తదితర అంశాల్లో అవకతవకలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిష్కరించాలంటూ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాశాయి.