AIR India | న్యూఢిల్లీ, మే 23: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది యాజమాన్యం. ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న పైలెట్లకు బోనస్ను కూడా అందించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఎయిర్ ఇండియా సీహెచ్ఆర్వో రవీంద్ర కుమార్ జీపీ మాట్లాడుతూ..ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా వేతనాలను పెంచుతున్నట్లు, పనితీరు ఆధారంగా బోనస్ను కూడా అందిస్తున్నట్లు చెప్పారు.
వేతనాలు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థలో 18 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31, 2023 కంటే ముందుగా చేరిన ఉద్యోగులకు మాత్రమే ఈ వేతన పెంపు వర్తించనున్నది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్ చేసుకొని రెండేండ్ల తర్వాత ప్రకటించిన తొలి వేతన పెంపు ఇదే కావడం విశేషం.