న్యూఢిల్లీ : చాట్జీపీటీ సహా ఏఐ (AI ) జనరేటివ్ టూల్స్ రాకతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే చర్చ టెక్ ప్రపంచంలో ఊపందుకుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడంతో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్లో చాట్జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేయగా ఈ ఇంటరాక్టివ్ ఏఐ టూల్ మనం ఊహించని ఎన్నో పనులను చక్కబెడుతూ మానవ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా దూసుకుపోతోంది. ఏఐ టూల్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిరూపితమైంది. దీంతో రాబోయే రోజుల్లో ఏఐతో పెద్దసంఖ్యలో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రానున్న ఏఐ విప్లవంతో నాలుగింట ఓ వంతు ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఆర్ధిక సహకార, అభివృద్ధి సంస్ధ (ఓఈసీడీ) సర్వే స్ఫష్టం చేసింది. 27 శాతం ఉద్యోగులకు న్యూ టెక్నాలజీతో ముప్పు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఏఐతో తమ ఉద్యోగాలు ఊడతాయని కార్మికులు కలత చెందుతున్నారని ఓఈసీడీ నివేదిక పేర్కొంది. 38 దేశాలతో కూడిన ఓఈసీడీలో సంపన్న దేశాలతో పాటు మెక్సికో వంటి ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధలు కూడా సభ్యులుగా ఉన్నాయి. ఏఐ విప్లవం ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నందున జాబ్ మార్కెట్పై ఏఐ ప్రభావానికి పరిమిత ఆధారాలున్నాయని ఓఈసీడీ పేర్కొంది.
పనిప్రదేశాల్లో ఉద్యోగులను ఏఐ ఎలా రీప్లేస్ చేస్తుంది, కొలువుల ముప్పు కంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయా అనేది మనం తీసుకునే విధానపరమైన చర్యలపై ఆధారపడి ఉంటాయని ఓఈసీడీ సెక్రటరీ జనరల్ మధీస్ కార్మన్ పేర్కొన్నారు. ఏఐ ద్వారా అందివచ్చే ప్రయోజనాల కోసం మార్పులకు అనుగుణంగా కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వాలు సిద్ధం చేయాలని సూచించారు. కార్మికులు, తక్కువ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీతో ముప్పు అధికంగా ఉందని, 27 శాతం ఉద్యోగాలు ఏఐతో రీప్లేస్ అవుతాయని ఓఈసీడీ సర్వే తెలిపింది.
Read More :
Google Play Store | చైనాకు డేటా మళ్లింపు.. ఆ రెండు యాప్ల పట్ల అలర్ట్గా ఉండండి..!