Google Play Store | గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ తన యూజర్ల డేటా భద్రతకు చర్యలు తీసుకుంటున్నది. అయినా హానికర యాప్లు యూజర్ల డేటా తస్కరణకు మార్గాలు కనిపెడుతూనే ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్లో దూరి, గూగుల్ రక్షణ కవచాన్ని దాటేసి, యూజర్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరిస్తూనే ఉన్నాయి.. అందులో రెండు యాప్లు గూగుల్ ప్లే స్టోర్’లో చేరి 15 లక్షల మంది యూజర్లపై ప్రభావం చూపుతున్నాయని ప్రాడో (Pradeo) అనే మొబైల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఈ యాప్లు యూజర్ల సున్నితమైన డేటా సేకరించి.. చైనాకు తరలిస్తున్నాయని ప్రాడో పేర్కొంది. అలా డేటా తస్కరిస్తున్న యాప్లు ‘ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ, ఫైల్ మేనేజర్’ అని ప్రాడో హెచ్చరించింది. ఈ యాప్లు తక్షణం తొలగించాలని యూజర్లను హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో యూజర్ల డేటా భద్రత కోసం గతేడాది కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. తద్వారా యూజర్ల నుంచి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో గల యాప్లు సేకరిస్తున్న డేటా గురించి డేటా సేఫ్టీ (Data Safety) అనే సెక్షన్లో తెలియజేయాలని స్పష్టం చేసింది. కానీ, యూజర్ల డేటా తస్కరించడానికి ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ, ఫైల్ మేనేజర్ యాప్లు కొత్త ఎత్తు వేశాయి. డేటా సేకరించడం లేదని గూగుల్ ప్లే స్టోర్లో చెబుతూ.. యూజర్ కాంటాక్ట్ లిస్ట్, లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్, నెట్ వర్క్ ప్రొవైడర్ పేరు తదితర వివరాలు చైనాకు చేరవేస్తున్నాయని ప్రాడో తెలిపింది.