External Minister Jaishankar – AI | వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు. ఆదివారం కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అణ్వాయుధాల మాదిరిగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తలెత్తే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు అణ్వాయుధాల మాదిరిగా.. ప్రస్తుతం గ్లోబల్ ఎకో సిస్టమ్లో అత్యంత ఉన్నత స్థానంలో నిలువనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.
2024 కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ లో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ తో జరిగిన చర్చాగోష్టిలో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే దశాబ్దంలో ప్రపంచీకరణ కూడా ఆయుధంగా మారుతుందని, కనుక ప్రపంచ దేశాలు ఆచితూచి ముందుకు సాగాలన్నారు. గత దశాబ్దిలో ప్రపంచీకరణపై సామాజికంగా, రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తేవన్నారు. ప్రపంచీకరణ వాస్తవ రూపం దాల్చిన తర్వాత రక్షణాత్మక వాదం ముందుకు వచ్చిందన్నారు.