న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. ఈ అంశాల నేపథ్యంలో భారత్ జీడీపీ అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాల్ని 6.4 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. తాజాగా ఏడీబీ ‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ సెప్టెంబర్ 2023’ విడుదల చేసింది.
అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో మరింత ఆర్థిక అనిశ్చితి ఏర్పడవచ్చని, ఆహారోత్పత్తుల ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని ఏడీబీ హెచ్చరించింది. ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ సంబంధిత ఇబ్బందులు తలెత్తి దిగుబడి తగ్గవచ్చని, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వచ్చే రబీ సీజన్లో కూడా వ్యవసాయ వృద్ధికి విఘాతం ఏర్పడవచ్చని ఏడీబీ అంచనా వేసింది.