ముంబై, అక్టోబర్ 24: కృత్రిమంగా ప్రమోటర్లు పెంచిన కారణంగా అదానీ గ్రూప్ షేర్లు అధిక విలువలకు ట్రేడవుతున్నాయని, అవి 85 శాతం పతనమవుతాయంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో పేర్కొన్న మేరకు తాజాగా అదానీ టోటల్ గ్యాస్ షేరు అదే విలువకు పడిపోయింది. అదానీ గ్రూప్ పలు షెల్ కంపెనీలకు నిధుల్ని మళ్లించి, షేర్లను ఇష్టానుసారం పెంచివేసిందని, పలు కార్పొరేట్ మోసాలకు పాల్పడిదంటూ జనవరి 24న హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నివేదిక వెలువడినంతనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లకుపైగా కరిగిపోయిన విషయం విదితమే. అటుతర్వాత మరో యూఎస్ ఫండ్ జీక్యూజీ పార్టనర్స్ పెట్టుబడులతో కొంతమేరకు అదానీ గ్రూప్ షేర్లు కోలుకున్నా, ఇటీవల తిరిగి తగ్గుముఖం పడుతున్నాయి. అందులో సిటి-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అయిన అదానీ టోటల్ షేరు బీఎస్ఈలో సోమవారం నాటి రూ. 575కు తగ్గింది. జనవరి 24న ఈ షేరు ధర రూ.3,892. దీంతో పోలిస్తే కేవలం తొమ్మిది నెలల్లో అదానీ టోటల్ ధర 85 శాతం పతనమయ్యింది.
అదానీ గ్రూప్నకు చెందిన 10 షేర్లు ప్రస్తుతం మార్కెట్లో ట్రేడవుతున్నాయి. అవి..అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్, ఏసీసీ, అంబూజా సిమెంట్స్, ఎన్డీటీవీలు. వీటిలో ఎన్డీటీవీని అదానీ గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసింది. మిగిలిన తొమ్మిది గ్రూప్ కంపెనీల్లో అదానీ పోర్ట్స్ మినహా మిగిలిన షేర్లన్నీ జనవరి 24 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 20 నుంచి 70 శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి.
హిండెన్బర్గ్ ఏమన్నదంటే..
కార్పొరేట్ అవకతవకల్ని పరిశీలించకపోయినా, అదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక పనితీరును ప్రకారం ఆయా షేరు ధరలు చాలా అధికమని ఇట్టే తెలిసిపోతుందని హిండెన్బర్గ్ రిపోర్ట్లో వ్యాఖ్యానించింది. మౌలిక రంగ కంపెనీల వృద్ధి తీరు నిద్రాణంగా ఉంటుందని, లాభాల్లో వృద్ధి అంతంతమాత్రమేనని, అందుచేత అవి తక్కువ పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) రేషియోతో ట్రేడవుతాయని వివరించింది. అయినప్పటికీ, అదానీ లిస్టెడ్ కంపెనీల స్టాక్ విలువలు అధిక వృద్ధిని సాధించే టెక్నాలజీ కంపెనీలతో పోటీపడుతున్నాయని, సంవత్సరాల తరబడి కృత్రిమంగా షేర్ల ధరల్ని పెంచడం ఇందుకు కారణమని ఆరోపించింది.