Battle for NDTV | ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ల సారధ్యంలోని ఎన్డీటీవీని టేకోవర్ చేసేందుకు భారతీయ బిలియనీర్ గౌతం అదానీకి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తున్నది. ఎన్డీటీవీ గ్రూప్ ప్రమోటర్ సంస్థ రాధికారాయ్ ప్రణయ్ రాయ్ (ఆర్ఆర్పీఆర్) వాటాలను అదానీ గ్రూప్నకు విక్రయించేందుకు తమ అనుమతి అవసరం లేదని ఆదాయం పన్ను విభాగం శనివారం తేల్చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్లకు ఈ విషయమై అదానీ గ్రూప్ సమాచారం ఇచ్చింది.
విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) సంస్థ వద్ద ఆర్ఆర్పీఆర్ రుణాలు తీసుకున్నది. ఆ రుణాలు చెల్లించకపోతే అందుకు బదులుగా ఆర్ఆర్పీఆర్లో 29.18 శాతం వాటాలను క్లయిమ్ చేసే అధికారం వీసీపీఎల్కు ఉంది. కనుక ఒప్పందం మేరకు వీసీపీఎల్ను టేకోవర్ చేసుకున్న అదానీ గ్రూప్కు వాటాలను బదిలీ చేయడమే ఎన్డీటీవీ ప్రమోటర్ల సంస్థ ముందు ఉన్న కర్తవ్యంగా కనిపిస్తున్నది.
తొలుత తమ వాటాలను విక్రయించడానికి సెబీ అనుమతి కావాలని ఎన్డీటీవీ ప్రమోటర్లు ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్కు వాటాల బదిలీకి తమ అనుమతి అవసరం లేదని సెబీ తేల్చి చెప్పింది. అయితే, తమకు సమాచారం ఇవ్వకుండా వీసీపీఎల్, అదానీ గ్రూప్ ఇదంతా చేశాయని ప్రణయ్ రాయ్, రాధికారాయ్ ఆరోపిస్తున్నారు.