Adani Group | అదానీ గ్రూప్ కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. దేశంలోనే అత్యంత రద్దీగా పిలిచే 8 ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేసింది. దీని కోసం నిబంధనలను మార్చివేసింది. నీతి ఆయోగ్, డీఈఏ సూచనలను బుట్టదాఖలు చేసింది. ఫలితంగా.. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని అదానీ గ్రూప్.. దేశంలోనే రెండో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా అవతరించింది. రెండేండ్ల వ్యవధిలోనే ఇదంతా పూర్తవ్వడం గమనార్హం. ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకొన్న అదానీ కంపెనీ ఇప్పుడు ప్రయాణికులను దోచుకొనే కుట్రకు తెరలేపింది. లక్నో ఎయిర్పోర్టులో యూడీఎఫ్ చార్జీల సవరణ దీంట్లో భాగమే.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో రద్దీగా ఉండే ఎనిమిది ఎయిర్పోర్టులను కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీలకు డీల్ అప్పగించవద్దంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ), నీతి ఆయోగ్ చేసిన సూచనలను కూడా పక్కనబెట్టిమరీ ఈ ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఏఈయూ), ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు రెండేండ్లుగా నిరసనోద్యమాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
లక్నో, జైపూర్, గువాహటి, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురంలోని విమానాశ్రయాల నిర్వహణకు కేంద్రం 2018 డిసెంబర్లో టెండర్లు పిలిచింది. ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని అదానీ గ్రూప్ కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొంది. జాబితాలోని ఎయిర్పోర్టుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఒక ప్రైవేట్ సంస్థకు రెండుకు మించి ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పకూడదని డీఈఏ సూచనలు చేసింది. ఒకవేళ అలా చేస్తే, నిర్వహణ ప్రమాణాలు, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురుకావచ్చని హెచ్చరించింది.
సాంకేతికత పరంగా గతంలో అనుభవంలేని కంపెనీలకు ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పవద్దని, లీజుకు బదులు లైసెన్స్ విధానాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా తేల్చిచెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-1994 చట్టం ప్రకారం.. ఏ ఎయిర్పోర్టును కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30 ఏండ్లకు మించి లీజుకు ఇవ్వకూడదు. అయితే, డీఈఏ, నీతి ఆయోగ్ సూచనలు, 1994 ఎయిర్పోర్ట్స్ చట్టాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం.. ఈ ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను 50 ఏండ్లపాటు అదానీ గ్రూప్నకు కట్టబెట్టింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు విమర్శలున్నాయి. అదానీ గ్రూప్నకు కాంట్రాక్ట్ రావడానికి బిడ్డింగ్లో పోటీలేకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్టు కూడా వాదనలున్నాయి.
జీవీకే గ్రూప్ నిర్వహణలో ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ను కూడా చివరకు అదానీ గ్రూప్ కైవసం చేసుకొన్నది. ముంబై ఎయిర్పోర్టులో జీవీకేకు 50.5 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్హడ్ కంపెనీకి 13.5 శాతం వాటా ఉన్నది. ఒకవేళ బిడ్వెస్ట్హడ్ తన వాటాలను విక్రయించాలనుకొంటే తొలుత జీవీకేకు ఆ ఆఫర్ను ఇవ్వాలి. ఈ మేరకు ఆర్వోఎఫ్ఆర్ (రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్) క్లాజ్ను నిబంధనల్లో చేర్చారు. అయితే, అదానీ గ్రూప్ ఈ నిబంధనను తుంగలోతొక్కి, 2019లో బిడ్వెస్ట్హడ్ వాటాను చేజిక్కించుకొన్నది. దీంతో జీవీకే గ్రూప్ కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది.
ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో రూ.705 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు 2020 జూన్లో సీబీఐ.. జీవీకే గ్రూప్పై కేసు నమోదు చేసింది. అయితే, ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఉన్న తన 50.5 శాతం వాటాను అదానీ గ్రూప్నకు జీవీకే గ్రూప్ అప్పగించిందో.. సీబీఐ యూ-టర్న్ తీసుకొన్నది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదంటూ కోర్టుకు తెలిపింది. జీవీకే గ్రూప్నకు ఒకవిధంగా క్లీన్చిట్ ఇచ్చింది. ఈ ఉదంతం వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్నదని, అదానీ గ్రూప్నకు ముంబై ఎయిర్పోర్టును అప్పగించడానికే జీవీకే గ్రూప్పై వేధింపుల పర్వం కొనసాగించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. అలాగే, ప్రతిపాదిత నవీ ముంబై ఎయిర్పోర్ట్ నిర్వహణ కూడా అదానీ గ్రూప్నకే దక్కింది.
అదానీ గ్రూప్నకు ఆరు ఎయిర్పోర్టులను కట్టబెట్టే ఒప్పందంలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయంటూ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కిందటేడాది పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అదానీ ఎంటర్ప్రైజెస్కు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చిందని మండిపడ్డారు. ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకొనేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కోట్ చేసిన మొత్తం పైనా అనుమానాలున్నాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఏఈయూ) ఆరోపించింది. గడిచిన రెండేండ్లుగా దీనిపై ఉద్యోగులు, ప్రజాసంఘాల నేతలు పెద్దయెత్తున నిరసనలు చేపడుతున్నప్పటికీ, అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు అదానీ గ్రూప్గానీ ఏమాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో అవకతవకలు జరిగిన మాట నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్పోర్టుల నిర్వహణను చేజిక్కించుకొన్న అదానీ గ్రూప్.. ఇప్పుడు ప్రయాణికుల నుంచి డబ్బులను యథేచ్ఛగా గుంజుకునే పథకానికి తెరతీసింది. లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్వరలో ల్యాండింగ్, పార్కింగ్, యూజర్ డెవలప్మెంట్ చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. మూడు విడుతల్లో చార్జీలను ఐదురెట్లు పెంచడం గమనార్హం. ఈ మేరకు ఏఈఆర్ఏకి ప్రతిపాదనలు పంపించింది. తమ నియంత్రణలో ఉన్న మిగతా ఎయిర్పోర్టుల్లో కూడా అదానీ గ్రూప్ త్వరలోనే చార్జీలను పెంచే అవకాశమున్నదని విమానయాన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.