న్యూఢిల్లీ, జనవరి 31: తీవ్ర ఆరోపణల్లో కూరుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి జారీ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) సహ పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3,276-3,112 ధరల శ్రేణితో రూ. 20,000 కోట్ల సమీకరణకు మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎఫ్పీవోకు చివరిరోజైన మంగళవారం కొద్దిమంది పారిశ్రామికవేత్తలు చేయూతనిచ్చారని, దీంతో ఆఫర్ సబ్స్క్రయిబ్ అయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, సజ్జన్ జిందాల్ తదితర పారిశ్రామివేత్తల కుటుంబ కార్యాలయాల నుంచి బిడ్స్ వచ్చాయని అంటున్నారు. అదానీ గ్రూప్ మాత్రం పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్ల పేర్లు వెల్లడించలేదు. ఎఫ్పీవోలో 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, 5.08 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి.
చివరి క్షణాల్లో బిడ్డింగ్
అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఆఫర్ ధరకంటే 15 శాతం దిగువకు రూ. 2,665 వరకూ పడిపోయింది. మార్కెట్లోనే తక్కువ ధరకు లభ్యంకావడం, గ్రూప్పై వెల్లువెత్తిన ఆరోపణల కారణంగా జనవరి 27న ప్రారంభమైన ఎఫ్పీవోకు సబ్స్క్రయిబ్ చేసేవారే కరువయ్యారు. ఆఫర్ ప్రారంభానికి ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్లుగా కొద్ది సంస్థలు చేసిన బిడ్డింగ్తో రూ. 6,000 కోట్ల వరకూ వచ్చింది. ఎఫ్పీవో తొలి రోజున 3 శాతం మాత్రమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ మొత్తంలో 90 శాతం షేర్లు సబ్స్క్రయిబ్ కాకపోతే, అప్పటివరకూ వచ్చిన మొత్తాన్నంతా ఇన్వెస్టర్లకు అదానీ చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చివరిరోజున మధ్యాహ్నం రెండు గంటలవరకూ కూడా కనీసం 86 శాతం షేర్లకే బిడ్స్ వచ్చాయి. అటుతర్వాత ముగింపు సమయంలో హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు) పెద్ద మొత్తంలో షేర్లకు బిడ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రిటైలర్లు, ఉద్యోగులు దూరం
హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం జరిగారు. రిటైలర్లకు ఆఫర్లో 2.29 కోట్ల షేర్లు రిజర్వ్చేయగా కేవలం 12 శాతం షేర్లకు బిడ్స్ వచ్చాయి. అలాగే అదానీ గ్రూప్ ఉద్యోగులు సైతం ఆఫర్లో చురుగ్గా పాలుపంచుకోలేదు. ఆఫర్ ధరకు రూ.62 డిస్కౌంట్ను ఇస్తున్నా, రిటైలర్లు, ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.