న్యూఢిల్లీ, నవంబర్ 6: ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య సామ్రాజ్యంపై తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తూ యూఎస్ హెడ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదిక ప్రభావం అదానీ గ్రూప్పై క్రమేపీ పడుతున్నది. అప్పట్లోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు తన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకున్న ఈ గ్రూప్ తాజాగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వ్యాపారానికి గుడ్బై చెప్పనున్నట్టు సమాచారం. ఫార్చ్యూన్ బ్రాండ్ వంటనూనెల్ని విక్రయించే ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ నుంచి పూర్తిగా వైదొలగాలని అదానీ గ్రూప్ నిర్ణయించినట్టు ఎకనామిక్ టైమ్స్ తాజా కథనంలో పేర్కొంది. సింగపూర్కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో అదానీ గ్రూప్నకు 43.97 శాతం వాటా ఉన్నది. ఈ వాటా విక్రయంతో 2.5-3 బిలియన్ డాలర్లు (రూ.23,300-24,975 కోట్లు) లభిస్తాయని అంచనా. పలు సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, నెలరోజుల్లోగా ఈ లావాదేవీ ఖరారు అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫార్చ్మూన్తో సహా కింగ్స్, బుల్లెట్, రాగ్, జూబ్లి, అల్ఫా, ఆధార్ తదితర నూనెలు, కిరాణా సరుకుల సంబంధిత బ్రాండ్లు అదానీ విల్మార్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి.
రుణ భారం తగ్గాలన్న తపన
హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నిలువునా పతనంకావడంతో మదుపరుల విశ్వాసం బాగా దెబ్బతిన్నది. అప్పటికే భారీగా రూ.2.5 లక్షల కోట్ల రుణభారం ఉన్న అదానీ గ్రూప్ షేరు విలువల క్షీణత కారణంగా రుణ చెల్లింపులపై సందేహాలు మొదలయ్యాయి. దీంతో పలు కంపెనీల్లో కొద్దికొద్దిగా వాటాల్ని తక్కువ విలువకే విక్రయించడం ద్వారా కొంత రుణాన్ని తగ్గించుకోవడం, తనఖా చేసిన షేర్లను విడిపించుకోవడం వంటి కార్యకలాపాల ద్వారా మదుపరుల విశ్వాసం కొంత మేర కోలుకున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్నకు అప్రధాన ఆస్తుల్ని విక్రయించి నగదు నిల్వల్ని పెంచుకునే దిశగా ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్టు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో నాలుగు కంపెనీల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు కొంత వాటాల్ని అమెరికా ఈక్విటీ ఫండ్ జీక్యూజీ పార్టనర్స్కు రూ.15,000 కోట్లు, జూన్లో మూడు కంపెనీల్లో మరి కొంత వాటాల్ని అమ్మి రూ.11,330 కోట్లు సమీకరించారు. ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీలో 2.8 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి రూ.4,130 కోట్లకు విక్రయించారు.
రిలయన్స్ పోటీ
దేశంలో రిటైల్ వ్యాపారానికి వృద్ధి అవకాశాలున్నప్పటికీ, పలు బహుళజాతి కంపెనీలతో (ఎంఎన్సీలు) పాటే దేశీయ సంస్థల పోటీ తీవ్రతరమవుతున్నది. యూనీలీవర్, నెస్లే తదితర గ్లోబల్ దిగ్గజాలతో పాటు దేశీయంగా వ్యాపారం చేస్తున్న ఐటీసీ, బ్రిటానియా, మారికో, రిలయన్స్, టాటా, పతంజలి గ్రూప్లతో అదానీ పోటీ ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా అదానీ విల్మార్ వంటనూనెలు, ఆహార ధాన్యాలు, కిరాణా దినుసులకు పోటీగా రిలయన్స్ రిటైల్ ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ను ప్రారంభించింది. బిస్కెట్స్, వంటనూనెలు, ప్యాకేజ్డ్ పిండి విభాగంలో పతంజలి ఫుడ్స్, బిస్కెట్లలో పార్లే, బ్రిటానియాలు, పప్పు దినుసులు, ప్యాకేజ్డ్ వాటర్లో టాటా కన్జూమర్, ప్యాకేజ్డ్ పిండి, బిస్కెట్లలో ఐటీసీలు పోటీపడుతున్నాయి. వంటనూనెల విభాగంలో అదానీ విల్మార్ మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు రిలయన్స్ ప్రయత్నాలు ముమ్మరంకావడంతో అదానీ గ్రూప్ బ్రాండెడ్ రైస్, గోధుమ పిండి, చక్కెర అమ్మడం ప్రారంభించింది. ప్రీమియం బాస్మతి బియ్యం బ్రాండ్ కొహినూర్ను, చౌక బాస్మతి బ్రాండ్ చార్మినార్ను కొనుగోలు చేసింది. మరోవైపు గత రెండేండ్లలో రిలయన్స్ దాదాపు ఒక డజను ఎఫ్ఎంసీజి బ్రాండ్లను కొన్నది. ఈ రెండింటి పోటీ నడుమ టాటా కన్జూమర్ ప్రాడక్ట్స్ సైతం బ్రాండ్ల వరుస కొనుగోళ్లు జరుపుతూ పోటీని తీవ్రతరం చేస్తున్నది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ నివేదిక కారణంగా ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్నకు ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో పోటీకి భారీ నిధులు అవసరమవుతాయి. దీంతో మొత్తంగా ఈ వ్యాపారం నుంచి వైదొలిగేందుకే అదానీ మొగ్గుచూపిందని ఎకానమిక్ టైమ్స్ వివరించింది.