Adani Group | అదానీ గ్రూప్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని హిండెన్బర్గ్ సంస్థ ఇటీవల ఆరోపించింది. అయితే, అదానీ కంపెనీల్లో మోసాలు ఇప్పటివి కాదు. పాతికేండ్ల కిందటి నుంచే ఈ పరంపర కొనసాగుతున్నదని వార్తలు వస్తున్నాయి. గౌతమ్ అదానీ సోదరుడు రాజేశ్ అదానీని పలుమార్లు అరెస్టు కావడం, వజ్రాల కుంభకోణంలో అదానీ సన్నిహితుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు, అదానీ కంపెనీపై సెబీ రెండేండ్ల నిషేధం, డీఆర్ఐ కేసులు, మరో సోదరుడు వినోద్ సాయంతో రూ. 4 వేల కోట్ల స్కామ్.. వెరసి అదానీ గ్రూపు అక్రమాలకు పుట్టిల్లుగా నిలిచింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి.. లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ ‘హిండెన్బర్గ్’ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళంలోకి పడిపోయాయి. అయితే, అదానీ కంపెనీల్లో మోసాలు, అక్రమాలు ఇప్పటివి కాదని, 1998 కంటే ముందు నుంచే ఈ పరంపర కొనసాగుతున్నదని వార్తలు వస్తున్నాయి. గతంలో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే, ఇది నిజమేనని అర్థమవుతున్నది.
బొగ్గు, విద్యుత్తు రంగాలకు సంబంధించిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న 40కి పైగా కంపెనీలు ఇన్వాయిస్లో మొత్తాన్ని ఎక్కువచేసి చూపించాయని 2013-14లో డీఆర్ఐ గుర్తించింది. ఇండోనేషియా నుంచి బొగ్గు డైరెక్టుగా భారత్కు దిగుమతి అయినప్పటికీ, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ ద్వారా బొగ్గు దిగుమతులు జరిగినట్టు తప్పుడు బిల్స్ చూపించి ఎక్కువ చార్జీలు వేసినట్టు కనిపెట్టింది. ఈ స్కామ్ విలువ రూ. 29 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ఓవర్-వాయిసింగ్ పేరిట మార్చి 2016లో ఓ సర్యులర్ను జారీ చేసిన డీఆర్ఐ.. 40 కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ఇందులో పది కంపెనీలు అదానీ గ్రూప్వే కావడం గమనార్హం. ఈ కుంభకోణం మూలాలు విదేశాల్లో కూడా ఉన్నట్టు గమనించిన డీఆర్ఐ..2016లో లెటర్ రొగాటరీ (ఎల్ఆర్) సాయంతో సింగపూర్, దుబాయ్, హాంకాంగ్లోని భారతీయ బ్యాంకుల్లో దర్యాప్తు చేయడానికి విదేశీ న్యాయాధికారుల సాయాన్ని కోరింది.
స్కామ్కు సంబంధించి 85 శాతం ఇన్వాయిస్లు ఎస్బీఐ-సింగపూర్ నుంచే జరిగినట్టు డీఆర్ఐ తెలిపింది. అయితే, అంతర్జాతీయ చట్టపరమైన ఒప్పందాల పేరిట ఈ స్కామ్ విచారణలో డీఆర్ఐకు అక్కడి భారతీయ బ్యాంకులు సహకరించలేదు. ఇదే సమయంలో డీఆర్ఐ ఇచ్చిన ఎల్ఆర్ను సవాల్ చేస్తూ అదానీ ఎంటర్ప్రైజెస్ సింగపూర్ కింది కోర్టులో పిటిషన్ వేసింది. అయితే, డీఆర్ఐ అడిగిన రికార్డులు చూపించాల్సిందేనని కోర్టు చెప్పడంతో అదానీ గ్రూప్ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా అదానీ గ్రూప్నకు చుక్కెదురైంది. దీంతో బాంబే హైకోర్టును కంపెనీ ఆశ్రయించింది. ఎల్ఆర్ ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ ఆదేశాలపై డీఆర్ఐ సుప్రీంకోర్టులో కేసు వేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. తర్వాత కేసు మరుగునపడిపోయింది.
విద్యుత్తు పరికరాల ధరను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ అదానీ గ్రూప్నకు చెందిన రెండు కంపెనీలకు మే 15, 2014లో డీఆర్ఐ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. డీఆర్ఐ కథనం ప్రకారం.. చైనా, దక్షిణ కొరియాలోని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి భారత్కు డైరెక్ట్గా 2009, 2010లో పవర్ జనరేషన్ ఆండ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ దిగుమతి అయింది. అయితే దుబాయ్లోని ఎలక్ట్రోజెన్ ఇన్ఫ్రా ఎఫ్జడ్ఈ ద్వారా ఈ దిగుమతులు జరిగాయంటూ బిల్లుల్లో రేట్లను ఏకంగా 400 శాతం ఎక్కువ చేసి చూపించారు. దీని విలువ రూ. 4 వేల కోట్లు. ఈఐఎఫ్ కంపెనీ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందినదని డీఆర్ఐ వెల్లడించింది. దీనిపై డీఆర్ఐ రెండుసార్లు సీఈఎస్టీఏటీని ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సుప్రీంకోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉన్నది.
1998 కంటే ముందు నుంచే అదానీ గ్రూప్ కంపెనీల్లో చీకటి వ్యవహారాలు, అక్రమ లావాదేవీలు జరిగాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదానీ గ్రూప్లో ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గౌతమ్ అదానీ సోదరుడు రాజేశ్ అదానీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గతంలో పలుమార్లు అరెస్టు చేయడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నది. కస్టమ్స్ ఫ్రాడ్కు పాల్పడ్డారంటూ 2013 వరకూ రాజేశ్ను డీఆర్ఐ అధికారులు పలుమార్లు అరెస్టు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.
2004-06 మధ్య కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన వజ్రాల కుంభకోణం ప్రధాన నిందితుల్లో రాజేశ్ అదానీ, అదానీ బావమరిది సమీర్ వోరా కీలక నిందితులని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా పిలిచే దుబాయ్, సింగపూర్ దేశాలను వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా చేసుకొన్న వీళ్లు ఎగుమతుల్లో రాయితీలు పొందారని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే కేసులో కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ విభాగం రాజేశ్ అదానీ, సమీర్ వోరా, అదానీ ఎంటర్ప్రైజెస్తో పాటు అదానీ గ్రూప్నకు చెందిన మరో ఐదు డైమండ్ ట్రేడింగ్ కంపెనీలపై జరిమానా విధించింది. అయితే, 2015లో (కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉంది) సీఈఎస్టీఏటీ ఈ కేసును కొట్టేసింది. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
1999 అక్టోబర్-2021 మార్చి మధ్య కాలంలో అదానీ స్టాక్లలో ప్రైస్ రిగ్గింగ్ జరిగిందని, ఈ ఉదంతంలో స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్, ఆయన సన్నిహితులతో పాటు అదానీ గ్రూప్ ప్రమోటర్ల హస్తం కూడా ఉన్నదని సెబీ గుర్తించింది. దీంతో సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా 2007లో రెండేండ్లపాటు అదానీ గ్రూప్పై నిషేధం విధించింది.