న్యూఢిల్లీ, నవంబర్ 24: సెబీని తప్పుబట్టేందుకు తమకు ఏ కారణం కనిపించడం లేదని అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై విచారిస్తున్న సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మార్కెట్ రెగ్యులేటర్ పాత్రను అనుమానించేలా తమ ఎదుటకు ఏమీ రాలేదని స్పష్టం చేసింది. అంతేగాక ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని చెప్పబోమన్న అత్యున్నత న్యాయస్థానం.. మీడియాలో వచ్చినదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా సెబీని ఆదేశించలేమన్నది. ఈ క్రమంలోనే తీర్పును రిజర్వ్ చేసింది. అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పరిడివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగానే సెబీకి దాదాపుగా సుప్రీం క్లీన్చిట్ ఇచ్చింది.
మరోవైపు ఈ కేసులో సెబీ పాత్రపై అనుమానం ఉందని ఓ పిటిషనర్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే అసలు సెబీ దర్యాప్తును నమ్మడం ఎలా? అన్ని ప్రశ్నించారు. దీంతో సెబీ ఏం చేసిందన్నది మా ముందున్న నివేదికలో ఉందంటూ ధర్మాసనం భూషణ్ వాదనను తోసిపుచ్చింది. ఇక గతంలో సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలోని ఇద్దరి అభిప్రాయాలను భూషణ్ ఊటంకించడంపైనా ధర్మాసనం ఈ సందర్భంగా స్పందించింది. ఆరోపణలు చేయడం చాలా సులువన్న కోర్టు.. ఈ విషయంలో భూషణ్కూ ఒకింత చురకలు అంటించడం గమనార్హం. సెబీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా.. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఉన్న మొత్తం 24 ఆరోపణల్లో 22 పైన దర్యాప్తు పూర్తయిందన్నారు. మిగతా రెండు కేసుల్లో విదేశీ రెగ్యులేటర్ల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు గడువును మరోసారి పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఈ అంశంపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. కాగా, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ.. అదానీ గ్రూప్నకు అందులో క్లీన్చిట్ ఇచ్చిన సంగతి విదితమే. ప్రాథమికంగా ఎటువంటి తప్పులు జరుగలేదన్నదీ తెలిసిందే. ఈ విషయంలో సెబీ వైపు నుంచి కూడా ఎటువంటి లోపాలు లేవన్నది.
అదానీ గ్రూప్ సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడి షేర్ల విలువను కృత్రిమంగా పెంచుకున్నాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఈ ఏడాది ఆరంభంలో ఓ సంచలన నివేదికను విడుదల చేసిన సంగతి విదితమే. దీంతో ఆయా కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కూడా రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు హరించుకుపోయింది. మదుపరుల సంపద పెద్ద ఎత్తున ఆవిరైపోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది.