న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: సొలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీ కోసం మూడు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం 2030కల్లా 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేయాలన్న తమ ప్రణాళికలో భాగంగా ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2030లోకెల్లా ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ ఆవార్డు స్వీకరించిన అనంతరం అదానీ మాట్లాడుతూ ప్రస్తుతం తమ గ్రూప్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పాదక సామర్థ్యం 20 గిగావాట్లని, 2030కల్లా దీనికి మరో 45 గిగావాట్ల సామర్థ్యాన్ని జతచేస్తామని, 3 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తామని వివరించారు.
పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ ఐదో గిగా ఫ్యాక్టరీని ప్రకటించిన కొద్దివారాలకే అదానీ ప్రకటన వెలువడటం గమనార్హం. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే సోలార్ మాడ్యూల్స్ తయారీకి, నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్స్ తయారీకి, గ్రిడ్ నుంచి విద్యుత్ను స్టోర్ చేసే ఫ్యూయల్ సెల్స్, ఉత్పత్తికి మూడు గిగా ఫ్యాక్టరీలు, సొంత అవసరాల కోసం 20 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం మరో గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది ముకేశ్ ప్రకటించారు.
2050కల్లా 70 ట్రిలియన్ డాలర్లు
అమెరికా-భారత్ 2050కల్లా భారీ వృద్ధిని సాధిస్తాయని, ఈ రెండు దేశాల జీడీపీ 70 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇది 35-40 శాతం కానుందని అదానీ అంచనా వేశారు. ఇరు దేశాల జనభా 200 కోట్లు మించుతుందని, జనాభా సగటు వయస్సు 40 ఏండ్లలోపే ఉంటుందన్నారు. ఈ గణాంకాల దృష్టితో చూస్తే వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందన్నారు.