Adani Group- Dharavi | ధారావి.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ.. కొవిడ్-19 మహమ్మారి వేళ.. దీని గురించి ప్రపంచానికి తెలిసింది. పేద, అట్టడుగు వర్గాల వారు నివసించే ఈ ధారావి వాసులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తీపి కబురందించింది. అర్హులైన నివాసులకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఫ్లాట్లు అందిస్తామని సోమవారం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధారావి మురికివాడను రీ డెవలపింగ్ చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆఫర్ చేసిన ప్రతిపాదన కంటే 17 శాతం, అంతకంటే ఎక్కువ సైజ్ గల ఫ్లాట్లు ధారావి వాసులకు అందజేస్తామని తెలిపింది.
తొలి ప్రతిపాదన ప్రకారం 269 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇండ్లు ఇస్తామని అదానీ గ్రూప్ పేర్కొంది. కొత్త ఇండ్లలో కిచెన్, టాయిలెట్ ఉంటాయని వివరించింది. 2018 నుంచి ధారావి వాసులకు ‘పట్టణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద 315-322 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇండ్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. ధారావి రీడెవలపింగ్ ప్రాంతంలో కమ్యూనిటీ హాళ్లు, రీక్రియేషనల్ ఏరియాలు, పబ్లిక్ గార్డెన్స్, డిస్పెన్సరీలు, పిల్లలకు డే కేర్ సెంటర్లు ఉంటాయి. 2000 జనవరి నాటికి ఇక్కడ ఇల్లు ఉన్న వారిని ఈ పథకానికి అర్హులుగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతరులకు చౌక అద్దె ఇంటి విధానం కింద అకామిడేషన్ కల్పించనున్నది.