Adani Group | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తమ గ్రూప్నకు చెందిన కంపెనీలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించడానికి అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్’ను నియమించుకోవడంపై అదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. స్వతంత్ర ఆడిటింగ్ కోసం తామెలాంటి సంస్థనూ నియమించుకోలేదని, అదంతా మార్కెట్ పుకార్లేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు బీఎస్ఈకి ఇచ్చిన ఫైలింగ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ గురువారం పేర్కొంది. సెబీతో పూర్తి వివరాలు పంచుకొంటామని తెలిపింది. ఈ విషయంపై మరే ఇతర కామెంట్ చేయబోమని వెల్లడించింది. కాగా, ‘హిండెన్బర్గ్’ రీసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్’ను అదానీ గ్రూప్ నియమించినట్టు, ఈ మేరకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నట్టు ప్రధాన పత్రికలు కథనాలు వెలువరించాయి. తమ గ్రూప్ అన్ని చట్టాలను పాటిస్తున్నదని, ఏ విషయాలను దాచిపెట్టలేదని, ఆర్బీఐ వంటి నియంత్రణ సంస్థలకు నిరూపించడమే ఈ ఆడిట్ ఉద్దేశంగా ప్రతినిధులు చెప్పినట్టు వివరించాయి.
గ్రూప్లోని కంపెనీలపై ఆడిటింగ్ కోసం ‘గ్రాంట్ థాంటన్’ను అదానీ గ్రూప్ నియమించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చిం ది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, స్పోర్ట్స్ డైరెక్ట్, పాటిస్సెరీ వలేరియా తదితర ఎనిమిదికి పైగా కేసుల్లో ‘గ్రాంట్ థాంటన్’ సంస్థ ఇప్పటివరకూ ఇచ్చిన ఆడిటింగ్ నివేదికలు తప్పుల తడకగా, లోపభూయిష్టంగా ఉండటమే దీనికి కారణం. ఇక, స్వతంత్ర ఆడిటింగ్కు అదానీ గ్రూప్ ‘గ్రాంట్ థాంటన్’ను నియమించుకొన్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఈ అంశంలో స్పష్టతనివ్వాలని ప్రధాన ఎక్సేంజీలు అదానీ గ్రూప్ను కోరినట్టు సమాచారం. సర్వత్రా ఒత్తిళ్లు రావడంతో ఈ అంశంలో అదానీ గ్రూప్ యూటర్న్ తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)