హిండెన్బర్గ్-అదానీ గ్రూప్ వ్యవహారంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పెట్టుబడులు కరిగిపోతున్నాయి.
గడిచిన 11 రోజుల్లో ఒక్క ఎల్ఐసీకి వాటిల్లిన నష్టమే రూ.38,745 కోట్లు. గత నెల 24న రూ.81,268 కోట్లుగా ఉన్న పెట్టుబడులు.. ఈ నెల 9న రూ.42,523 కోట్లకు దిగజారాయి.
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు, మ్యూచువల్ ఫండ్స్ కోల్పోయింది రూ.1.6 లక్షల కోట్లదాకా ఉన్నది. మొత్తంగా ఎల్ఐసీ, ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్స్.. అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ గత 11 రోజుల్లో రూ.2 లక్షల కోట్ల మేరకు హరించుకుపోయింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలో అతిపెద్ద సంస్థాగత మదుపరి, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పెట్టుబడులకు హిండెన్బర్గ్-అదానీ సెగ గట్టిగానే తగులుతున్నది. ఏండ్ల తరబడి పెట్టిన పెట్టుబడులు.. రోజులు, వారాల్లోనే కరిగిపోతున్నాయి మరి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని, అందుకే దాని సంస్థల షేర్ల విలువ స్టాక్ మార్కెట్లలో అమాంతం పెరిగిపోయిందని గత నెల 24న అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి అదానీ షేర్లు కుప్పకూలుతున్న సంగతీ విదితమే. ఈ నెల 9 వరకు గమనిస్తే ట్రేడింగ్ జరిగిన 11 రోజుల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.38,745 కోట్లు పడిపోయింది. జనవరి 24న రూ. 81,268 కోట్లుగా ఉన్న పెట్టుబడులు.. ఫిబ్రవరి 9న రూ. 42,523 కోట్లకు దిగజారాయి. మొత్తం 7 అదానీ సంస్థల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది.
మ్యూచువల్ ఫండ్స్
అదానీ గ్రూప్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడులూ కరిగిపోయాయి. 11 రోజుల్లో రూ.7,317 కోట్లు నష్టపోయాయి. దీంతో వీటి పెట్టుబడుల విలువ రూ.17,246 కోట్లకు క్షీణించింది. జనవరి 24న రూ.24,563 కోట్లుగా ఉన్నాయి. అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, ఏసీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ భారీగా పెట్టుబ
డులు పెట్టాయి. వీటిలో నష్ట తీవ్రత కూడా అదే స్థాయిలో ఉన్నది. ముఖ్యంగా అదానీ పోర్టులు, అదానీ ఎంటర్ప్రైజెస్ల్లోకి గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులను తరలించాయి.
విదేశీ మదుపరులు
ఈ వ్యవహారంలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులే (ఎఫ్పీఐ) అత్యధికం గా నష్టపోయారు. అదానీ దూకుడుకు విపరీతంగా ఆకర్షితులైన ఎఫ్పీఐలు పెట్టుబడులను కుమ్మరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ పెట్టుబడుల విలువ అంతకంతకూ తరిగిపోతున్నది. గ్రూప్లోని 10 కంపెనీల్లో నూ ఎఫ్పీఐలు మదుపు చేశారు. జనవరి 24న ఎఫ్పీఐలు పెట్టిన పెట్టుబడుల విలువ రూ.2, 92, 731 కోట్లుగా ఉంటే, ఫిబ్రవరి 9న రూ.1,40,706 కోట్లకు దిగజారింది. గత 11 రోజుల్లో రూ.1, 52, 025 కోట్లు పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొత్తంగా చూసినట్టయితే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 9 మధ్య గ్రూప్ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు హరించుకుపోయింది.