న్యూఢిల్లీ, జూలై 8: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నిధుల వేటలో పడింది. గ్రూప్లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ సంస్థలున్నాయి. మొత్తం రూ.33వేల కోట్లకుపైగా నిధులను సమీకరించే దిశగా ఈ మూడూ వెళ్తున్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) మార్గం ద్వారా రూ.12,300 కోట్ల సేకరణకు అదానీ గ్రీన్ ఎనర్జీ పోనున్నది. ఈ ప్రతిపాదిత ఫండింగ్కు ఆ కంపెనీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.
అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు కలిసి రూ.21,000 కోట్లు సమీకరించాలని చూస్తున్నాయి. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ.8,500 కోట్లను తెచ్చుకోవాలని యోచిస్తున్నాయి. ఈ నిధులను సంస్థ కార్యకలాపాల విస్తరణకు, అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి, ఇతరత్రా వ్యయాలకు వినియోగించాలని అదానీ భావిస్తున్నది.
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ సంపద భారీ ఎత్తున కరిగిపోయిన విషయం తెలిసిందే. తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇప్పుడిప్పుడే అదానీ కంపెనీల మార్కెట్ విలువ కోలుకుంటున్నది. అయినప్పటికీ మదుపరుల్లో ఇంకా పూర్తి విశ్వాసాన్ని అదానీ కంపెనీలు పొందలేకపోతున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే గ్రూప్ నిధుల సమీకరణ మందగించిందని, ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తున్నదని అంటున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిధుల సమీకరణ విఫలమైతే అదానీ గ్రూప్నకు మరిన్ని చిక్కులు తప్పవని కూడా వారు అంచనా వేస్తుండటం గమనార్హం.
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో సంస్థలో వాటాను కొనుగోలు చేశారు. స్టార్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆన్లైన్లో రైల్ టిక్కెట్టు బుకింగ్ సేవలు అందించే ట్రైన్మాన్లో 30 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు శనివారం ప్రకటించింది. గతనెలలో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. రైల్వేను కూడా అదానీ గ్రూపునకు కట్టబెడుతున్నారని విపక్షాలు, ఇతర పార్టీలు వ్యతిరేకిస్తుండటం వల్లనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని, కేవలం 30 శాతం వాటాను కొనుగోలు చేశారని తెలుస్తున్నది. శనివారం స్టాక్ ఎక్సేంజ్లకు ఇచ్చిన సమాచారం మేరకు స్టార్ ఎంటర్ప్రైజెస్లో 29.81 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అదానీ డిజిటల్ ల్యాబ్స్ రూ.3.56 కోట్ల నిధులు వెచ్చించింది. ఈ ట్రైన్మాన్ను 2011లో వినీత్ చిరానియా, కరణ్ కుమార్లు ప్రారంభించారు.