న్యూఢిల్లీ, మార్చి 22: ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్పోర్ట్లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం జరిపే బిడ్డింగ్లో మరిన్ని విమానాశ్రయాలకు బిడ్ చేస్తామని అదానీ ఎయిర్పోర్ట్స్ సీఈవో అరుణ్ భన్సాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణకు గత రౌండ్ బిడ్డింగ్లో ఆరు విమానాశ్రయాల్ని అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. వచ్చే రోజుల్లో 12 ఎయిర్పోర్ట్లను ప్రైవేటుపరం చేసే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
నవీ ముంబైలో 2,866 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న అదానీ గ్రూప్.. గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ఎయిర్పోర్ట్లను నిర్మిస్తున్నది. నవీ ముంబై విమానాశ్రయం 2024 డిసెంబర్లో ప్రారంభమవుతుందని భన్సాల్ వెల్లడించారు. ఈ విమానాశ్రయం తొలిదశలో వార్షికంగా 2 కోట్ల మంది ప్రయాణీకుల్ని చేరవేస్తుందని, ఈ సామర్థ్యం 2036కల్లా 9 కోట్లకు పెరుగుతుందన్నారు. నవీ ముంబైతో సహా బిడ్డింగ్లో పొందిన 6 ఎయిర్పోర్ట్లు కాకుండా జీవీకే గ్రూప్ నుంచి టేకోవర్ చేసిన ముంబై విమానాశ్రయాన్ని ప్రస్తుతం అదానీ గ్రూప్ నిర్వహిస్తున్నది. తాము దేశీయ ఎయిర్పోర్ట్ల వ్యాపారంపై బుల్లిష్గా ఉన్నామని అదానీ ఎయిర్పోర్ట్స్ సీఈవో చెప్పారు.
తాము చేపట్టిన ఎయిర్పోర్ట్ల వ్యాపార విస్తరణలో వెనక్కు తగ్గేది లేదని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల మేరకు పెట్టుబడులు చేస్తామని అరుణ్ భన్సాల్ స్పష్టం చేశారు. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దారుణ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్కు సబ్సిడరీగా ఉంది.