Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రైవేటు దాహం, కార్పొరేట్ తీపికి ప్రభుత్వ రంగ సంస్థలు బలవుతున్నాయి. మోదీ సర్కార్ వినాశకర విధానాలతో పీఎస్యూలు బలిపీఠం ఎక్కుతున్నాయి. ఆ కోవలోకి చేరిన ఎల్ఐసీ.. కేవలం 50 రోజుల్లోనే రూ.50 వేల కోట్లు నష్టపోయింది. హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో మొదలైన అదానీ గ్రూపు పతనం.. ఆ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీని కూడా వెంటాడుతున్నది.
అదానీ గ్రూపు షేర్లు రోజురోజుకు కుప్పకూలుతుండటంతో ఎల్ఐసీ సంపద కూడా ఆవిరి అవుతున్నది. దేశంలో బీమా రంగంలో దశాబ్దాల పాటు రారాజుగా కొనసాగిన ఎల్ఐసీ.. కేంద్రం విధానాల వల్ల అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ.. ఇలా మొత్తం 7 అదానీ స్టాక్లలో పెట్టుబడులు పెట్టింది. 2022, డిసెంబర్ 31 నాటికి దాని మార్కెట్ విలువ రూ.82,970 కోట్లు ఉండగా, ఈ నెల 23కి రూ.33,242 కోట్లకు పడిపోవడంతో జరిగిన నష్టం తాజాగా రూ.49,728 కోట్లుగా తేలింది.
హిండెన్బర్గ్ నివేదిక వెలువడే నాటికి అదానీ సంపద రూ.19.2 లక్షల కోట్లు కాగా.. అది ఫిబ్రవరి 24 నాటికి రూ.7.15 లక్షల కోట్లకు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే రూ.12.05 లక్షల సంపద ఆవిరి కావడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ 29వ స్థానానికి పడిపోయారు. దేశంలోని కంపెనీల సంపద పరంగా చూస్తే టాటా గ్రూప్, రిలయన్స్, రాహుల్ బజాజ్ గ్రూప్ తర్వాత అదానీ గ్రూప్ ఉన్నది. హిండెన్బర్గ్ నివేదికకు ముందు టాటా గ్రూప్ తర్వాత రెండో స్థానంలో అదానీ గ్రూప్ ఉన్నది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనం కావడంతో దేశంలోని కంపెనీల మార్కెట్ విలువ రూ.280.4 లక్షల కోట్ల నుంచి రూ.260 లక్షల కోట్లకు పడిపోయింది. నెల రోజుల్లో మన దేశం 20.4 లక్షల మార్కెట్ విలువ కోల్పోయిందన్న మాట.
అదానీ గ్రూప్లో రూ.30,127 కోట్ల విలువైన షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. ఈ విలువ ఒక దశలో రూ.50 వేల కోట్లకు చేరుకోగా తాజాగా ఈ విలువ రూ.25 వేల కోట్లకు పడిపోయింది. అయితే మ్యూచ్వల్ ఫండ్స్ మాత్రం స్వల్పంగానే పడిపోవడం గుడ్డిలో మెల్ల అని చెప్పవచ్చు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత నిఫ్టీ50లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ 62 శాతం, అదానీ పోర్ట్స్ షేరు విలువ 27 శాతం తగ్గాయి. ఎక్కువగా అదానీకి చెందిన ఏసీసీ సిమెంట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్లో 11 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ 2 శాతం లోపునకు పడిపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్లు నిండా మునిగారు. అదానీ గ్రూప్నకు జరిగిన నష్టం ఉదంతం కార్పొరేట్ రంగానికి ఒక గుణపాఠంగా మిగిలిపోనున్నది.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత.. అదానీ టోటల్ గ్యాస్లో రూ.19,034 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్లో రూ.11,906 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్లో రూ.7,493 కోట్లు, అదానీ పోర్ట్స్లో రూ.5,217 కోట్లు.. మిగతా వాటితో కలుపుకొని మొత్తంగా రూ.49,728 కోట్ల సంపదను ఎల్ఐసీ నష్టపోయింది.