Gautham Adani |భారత్లోనూ, ఆసియాలోనూ రెండో అతిపెద్ద కుబేరుడు అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతం అదానీ మరో రికార్డు నెలకొల్పారు. అత్యధికంగా వ్యక్తిగత సంపద పెంచుకున్న కుబేరుల్లో గౌతం అదానీ మొదటి స్థానంలో ఉంటే.. తర్వాతీ స్థానంలో గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జెయ్ బ్రిన్, లగ్జరీ గూడ్స్ గ్రూప్ సంస్థ ఎల్వీఎంహెచ్ సీఈవో-ఫౌండర్ బెర్నార్డ్ అర్నాల్ట్ 39 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు.
గత ఏడాదిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కుబేరులు ఎలన్మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నార్డ్లను అదానీ దాటేశారు. గత ఏడాది కాలంలో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 49 బిలియన్ల డాలర్లు పెరిగింది. మొత్తం గౌతం అదానీ వ్యక్తిగత సంపద 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. వ్యక్తిగత సంపద పెంచుకోవడంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి చేరువలో ఉన్నారు. 2022లో టాప్-100 బిలియనీర్ల జాబితాలో రాధాకిషన్ దమానీ, హిందూజా గ్రూప్కు చెందిన ఎస్పీ హిందుజా తొలిసారి చేరారు. వీరిద్దరి నికర సంపద 23 బిలియన్ల డాలర్లు పెరిగింది.
ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 24 శాతం పెరిగి 103 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచింది. గత పదేండ్లలో ముకేశ్ సంపద 400 శాతం పెరిగితే.. గౌతం అదానీ 1830 శాతం పెంచుకున్నారని ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ బుధవారం తెలిపింది. గతేడాది కాలం (2021)లో ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లు పెరిగింది.ఆదాయం పెంచుకున్న బిలియనీర్లలో అంబానీ 8వ ర్యాంక్ పొందారు. పదేండ్ల క్రితం అంబానీ సంపద 20.5 బిలియన్ల డాలర్లయితే, ఐదేండ్ల క్రితం 45 బిలియన్ డాలర్లు. అదానీ వ్యక్తిగత సంపద (పదేండ్లలో) 8.8 బిలియన్ డాలర్ల నుంచి ఐదేండ్లలో 14 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది.
మరోవైపు ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ అధినేత శివ్నాడార్ వ్యక్తిగత సంపద 28 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిస్తే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సైరస్ పూనావాలా సంపద 26 బిలియన్ డాలర్లు, ఉక్కు దిగ్గజం లక్షీ ఎన్ మిట్టల్ సంపద 25 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.
ఎలన్మస్క్, జెఫ్బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ల కంటే ఎక్కువగా గౌతం అదానీ వ్యక్తిగత సంపద పెంచుకున్నారు. 2020లో సంప్రదాయేతర ఇంధన సంస్థ అదానీ గ్రీన్ సంపద 17 బిలియన్ల డాలర్లు. అయితే, స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత దాదాపు ఐదు రెట్లు పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరింది.
2022లో హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం కొత్త బిలియనీర్ల జాబితాలో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్ చేరారు. ఆమె వ్యక్తిగత సంపద 7.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. 69 దేశాల్లోని 2,557 కంపెనీల నుంచి 3,381 మంది కుబేరుల జాబితాను హురున్గ్లోబల్ రూపొందించింది.
గత పదేండ్లలో భారత కుబేరుల వ్యక్తిగత సంపద 700 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది స్విట్జర్లాండ్ జీడీపీతో సమానం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వృద్ధిరేటు కంటే రెండింతలు అని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఎండీ కం చీఫ్ రీసెర్చర్ అనాస్ రహ్మాన్ జునాయిద్ చెప్పారు. 100 కోట్ల డాలర్లకు చేరుకున్న కుబేరుల జాబితాలోనూ భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.
ప్రపంచ జనాభాలో భారత్ వాటా 18 శాతం.. వరల్డ్ బిలియనీర్లలో ఎనిమిది శాతం మనదేశంలో ఉన్నారు. ఐదేండ్ల క్రితం 4.9 శాతం మాత్రమే. కుబేరుల జాబితాలో 1,133 మందితో మొదటి స్థానంలో చైనా మొదటి స్థానంలో నిలిస్తే, 716 మందితో అమెరికా రెండో స్థానంలో, భారత్లో 215 మంది బిలియనీర్లు ఉన్నారు.